జగన్ కు చంద్రబాబు లేఖ .. మద్దతు ఇవ్వాలంటూ వినతి.. విషయమేంటంటే?
Publish Date:Apr 14, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు. వీరిద్దరికే కాకుండా చంద్రబాబు వేర్వేరుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ కు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుకు కూడా సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెల 16న అంటే గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా ఆ లేఖలో కోరారు. ఈ బిల్లు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. మహిళల రాజకీయ సాధికారతకు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి మద్దతు తెలుపుతూ, చట్టసభల్లో మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించే దిశగా అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని కోరారు. మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని, ప్రభుత్వ వ్యవస్థల్లో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ అంశంపై దశాబ్దాలుగా జరుగుతున్న చర్చలకు ఈ బిల్లు ముగింపు పలుకుతుందని, 2023లో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలకడం ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనమని తెలిపారు. 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్ర ఆలోచనను సమష్టిగా బలపరచాలని పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/cbn-letter-to-ys-jagan-39-217342.html





