వైసీపీ మెయిల్స్ కుట్రలపై చంద్రబాబు ఫైర్
Publish Date:Jul 9, 2025

Advertisement
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బ తీసేలా వివిధ సంస్థలకు వైసీపీ శ్రేణులు ఈ మెయిల్స్ పెట్టడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేయిస్తామని సీఎం ప్రకటించారు. బుధవారం (జులై 9) అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ.. పెట్టుబడులు అడ్డుకునేలా ఆయా సంస్థకు మెయిల్స్ చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లల్లో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ, విదేశీ కంపెనీలకు తప్పుడు ఈ మెయిళ్లు పెట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీనే తమ పార్టీ సానుభూతిపరులతో ఈ మెయిళ్లు పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు. తప్పులు చేసి.. ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమనే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందని సీఎం మండిపడ్డారు. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం.. పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం ముఖ్యమంత్రి సూచించారు.
రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈ మెయిళ్లు పెట్టడాన్ని సీరియస్గా తీసుకోవాలని పలువురు మంత్రులు కోరారు. దీనికి స్పందించిన సీఎం.. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసేలా ఈ మెయిళ్లు పెట్టిన అంశంపై విచారణకు ఆదేశిస్తానన్నారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలను దుష్ప్రచారం చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. అమరావతికి నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిందని ఈ సందర్భంగా పలువురు మంత్రులు గుర్తు చేశారు.
http://www.teluguone.com/news/content/cbn-fire-on-ycp-emails-conspiracy-39-201606.html












