ఫైబర్ నెట్ సమూల ప్రక్షాళనపై బాబు దృష్టి.. జీవీరెడ్డే రైట్!
Publish Date:Jul 16, 2025
Advertisement
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లొ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం, అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలను పెద్ద సంఖ్యలో ఫైబర్ నెట్ లో నియమించి వేతనాలు చెల్లించడమే కాకుండా, ఫైబర్ నెట్ ను వైసీపీ కార్యకర్తలు, నాయకులకు రాజకీయ ఆశ్రయ కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫైబర్ నెట్ ద్వారా జగన్ సొంత మీడియా ఉద్యోగులకు సైతం వేతనాలు వెళ్లాయన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా సైబర్ నెట్ ను అడ్డు పెట్టుకుని రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయలు గండి కొట్టారని అప్పట్లో తెలుగుదేశం, జనసేనలు ఆరోపించాయి. సరే ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అద్భుత విజయం సాధించి అధికార పగ్గాలు చేసట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సైబర్ నెట్ ప్రక్షాళనే ధ్యేయంగా చంద్రబాబు తెలుగుదేశం అధికార ప్రతినిథి జీవీ రెడ్డిని చైర్మన్ గా నియమించారు. విద్యావంతుడు, న్యాయవాది అయిన జీవీ రెడ్డి ఫైబర్ నెట్ కమిషనర్ గా బాధ్యతలు చేపడుతూనే ప్రక్షాళక చర్యలకు ఉపక్రమించారు. అయితే.. ఫైబర్ నెట్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి జీవీరెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరించడంతో జీవీరెడ్డి నేరుగా సీఎం చంద్రబాబుకు విషయాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం ఒకింత సంయమనంతో వ్యవహరించాలని సూచించడంతో సహనం కోల్పోయిన తన పదవికి రాజీనామా చేసి వైదొలిగారు. తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేసి రాజకీయాల నుంచే వైదొలిగారు. అయితే ఇటీవల సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ పై నిర్వహించిన సమీక్షలో నాడు జీవీరెడ్డి చెప్పిన విషయాలన్నీ అక్షరసత్యాలన్న విషయం వెలుగులోకి వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ కేవలం 130 మంది సిబ్బందితో చాలా ఎఫెక్టివ్ గా పని చేసింది. అదే వైసీపీ హయాంలో ఉద్యోగుల సంఖ్య పది రెట్లకు పైగా పెరిగింది. ఈ పెరిగిన నియామకాల్లో అత్యధికులు వైసీపీ విధేయులే ఉన్నారన్న విషయం కూడా చంద్రబాబు సమీక్షలో వెలుగు చూసింది. అంత భారీగా సిబ్బంది పెరిగినా వైసీపీ హయాంలో ఫైబర్ నేట్ సాధించింది శూన్యం. పైగా ఆ శాఖ పని తీరు తిరోగమనం దిశగా సాగింది. అంతకు ముందు వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ యాక్టివ్ కనెక్షన్ల సంఖ్య ఎనిమిది లక్షలు ఉంటే.. జగన్ హయాంలో ఇది నాలుగు లక్షలకు అంటే సగానికి పడిపోయింది. వాస్తవానికి జీవీరెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న స్వల్పకాలంలో గుర్తించి సరి చేయడానికి ప్రయ త్నించిన విషయం కూడా ఇదే. ఆయన అదనపు సిబ్బందిని, కార్యాలయానికి రాకుండా పేస్కేళ్లలో ఉన్న వారిని తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. ఫలితం లేకపోయింది. ఇప్పడు ఇదే విషయం చంద్రబాబు సమీక్షలో వెలుగు చూసింది. దీంతో ఆయన ఇప్పుడు ఫైబర్ నెట్ ప్రక్షాళనకు సీరియస్ గా నడుంబిగించారని తెలుస్తోంది. ఫైబర్ నెట్ సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
http://www.teluguone.com/news/content/cbn-eyes-thorough-cleaning-infibernet-25-202074.html





