Top Stories

dummy

political-news-img

యుద్ధంపై అమెరికా, ఇరాన్ పరస్పర విరుద్ధ ప్రకటనలు.. శాంతి ఎండమావేనా?

అమెరికాతో చర్చలు జరపడం లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేర జరుగుతున్న యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించిన తరుణంలో చర్చలు సానుకూలంగా ఉన్నాయంటూ వైట్ హౌస్ చేస్తున్న ప్రకటనలను ఇరాన్ ఖండించింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంప్రదింపులు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఈ మేరకు గత 31 రోజులుగా అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. చర్చల కోసం పాకిస్థాన్ వంటి మధ్యవర్తుల ద్వారా అమెరికా కేవలం కొన్ని ప్రతిపాదనలు మాత్రమే పంపిందని పేర్కొన్నారు. గతంలోని దౌత్యపరమైన చేదు అనుభవాలను, ద్రోహాలను మరిచిపోలేదంటూ.. ప్రస్తుతం దేశ రక్షణపైనే తమ దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ వాదనకు పూర్తి విరుద్ధంగా అమెరికా చేస్తున్న ప్రకటనలతో గందరగోళం ఏర్పడుతోంది. ఇరాన్‌తో చర్చలు సానుకూల దిశలో ఉన్నాయన్న వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్, త్వరలోనే ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. వివాదాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 15 అంశాల శాంతి ప్రణాళికను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ట్రంప్ శాంతి ప్రణాళికకు బదులుగా యుద్ధ నష్టపరిహారం, ఆంక్షల ఎత్తివేత సహా ఐదు షరతులను విధించింది. ఇరాన్, అమెరికాల పరస్పర విరుద్ధ ప్రకటనలతో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Mar 31, 2026 10:02AM

political-news-img

సీఎస్‌కేపై రాజస్థాన్ ‘రాయల్’ విజయం

అయిదు సార్లు ఐపీఎల్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్ధాన్ రాయల్స్ చేతిలో ఘోరపరాజయం పాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 127 పరుగులకే ఆలౌట్ అయింది. టార్గెట్ చిన్నది అవ్వడంతో ధీమాగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లలో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52, 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ సూర్యవంశి ఔటైన తరువాత వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ ( 9 బంతుల్లో 18, 4 ఫోర్లు) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ( 36 బంతుల్లో, 38 నాటౌట్), రియాన్ పరాగ్ (11 బంతుల్లో 14 నాటౌట్)లు 12.1 ఓవర్లలోనే రాజస్థాన్‌కు ‘రాయల్’ విజయం అందించారు. గాయం కారణంగా స్టార్ ఆటగాడు ధోని, మరో డ్యాషింగ్ బ్యాటర్ డేవాల్డ్ బ్రెవిస్‌లు అందుబాటులో లేకపోవడం సీఎస్‌కేకి పెద్ద మైనస్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. చెన్నై జట్టులో జేమీ ఓవర్టన్ (43, 36 బంతులు) ఒక్కడే బ్యాట్‌కు పనిచెప్పగలిగాడు. అతని తర్వాత కార్తీక్ శర్మ (18) సీఎస్‌కే టాప్ స్కోరర్ అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Publish Date: Mar 31, 2026 7:51AM

political-news-img

గణపతీ లొంగిపోండి.. మావోయిస్టు అగ్రనేతకు డీజీపీ పిలుపు

తెలంగాణలో అజ్ఞాతంలో కొనసాగుతున్న మావోయిస్టు అగ్రనేతలకు రాష్ట్ర పోలీస్ శాఖ కీలక అల్టిమేటమ్ జారీ చేసింది. మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి వెంటనే లొంగిపో వాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల లొంగిపోయిన ఓమావోయిస్టు ద్వారా గణపతి ఆరోగ్యం సరిగా లేదన్న సమాచారం అందిందన్న డీజీపీ, వయస్సు, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అజ్ఞాత జీవితం కొనసాగించడం కష్టమవు తుందన్నారు. గణపతి లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతో పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తామన్నారు. కేంద్రం మావోయిస్టుల లొంగుబాటుకు ఇచ్చిన గడువు మంగళవారం (మార్చి 31)తో ముగియనున్న నేపథ్యంలో.. అజ్ఞాతంలో ఉన్న నాయకులు వెంటనే లొంగిపోవాలని కోరారు. లొంగిపోయిన వారికి భద్రత, పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ఇంకా లొంగిపోని తెలంగాణకు చెందిన మావోయిస్టులు పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, వరు శేఖర్ అలియాస్ మంగ్తు, జోడే రతా బాయి అలియాస్ సుజాత, నక్క సుశీల్ అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి ఉన్నారన్నారు. అడవుల్లో గడుపుతున్న జీవితాన్ని ముగించి వీరంతా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ మరోసారి పిలుపునిచ్చారు.

Publish Date: Mar 30, 2026 6:19PM

political-news-img

పేదల సొంతింటి కల సాకారం దిశగా మరో ముందడుగు.. ఒకే రోజు రెండున్నర లక్షల మందికి గృహాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారమయ్యే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మందితో సోమవారం (మార్చి 30)సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. కచ్చితంగా చెప్పాలంటే.. రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులు ఈ రోజు నూతన గృహాలలోకి అడుగు పెట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం ఏర్పడింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తరువాత ఇంతటి భారీ స్థాయిలో ప్రభుత్వం పేదలకు గృహాలు అందించడం ఇది రెండో సారి. సోమవారం (మార్చి 30) జరిగిన గృహాల పంపిణీలో భాగంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 1,00,875 టిడ్కో, 1,50,018 సాధారణ గృహాలను లబ్ధిదారులకు అందజేసింది. గత ఏడాది నవంబర్ లో 3 లక్షల మందికి ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రెండో విడతలో 2,50,893 మందికి గృహాలను అందించింది. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు గత జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.గత ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన రూ.174 కోట్ల సొమ్మును దారి మళ్లించిందని, ఆ మొత్తాన్ని తిరిగి 82 వేల కుటుంబాల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు మెరుగైన వసతులు కల్పించడంలో భాగంగా ప్రతి ఇంటికీ సి.ఎన్.జి గ్యాస్ కనెక్షన్ తో పాటు కుళాయి ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు.

Publish Date: Mar 30, 2026 5:59PM

political-news-img

వెంకయ్య జోక్యంతో వేగం పుంజుకున్న అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కేంద్ర ప్రభుత్వం వైపు మళ్లింది. అమరావతికి కేంద్ర చట్టబద్ధత కల్పించే ప్రక్రియపై ఢిల్లీలోని అధికార వర్గాల్లో కీలక చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక చర్చలు జరిపారు. అమరావతికి సంబంధించిన కేంద్ర చట్టంపై వెంకయ్యనాయుడు అమిత్ షాతో చర్చించారు. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించే విషయంలో వేగంగా కదలాలని ఆయన ఈ సందర్భంగా అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసిందని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ ప్రతిపాదనపపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తరువాత బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్ర స్థాయిలో వెంకయ్య నాయుడికి ఉన్న అనుభవం, సంబంధాలు, పలుకుబడి ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తికావడానికి ఆయన జోకయం దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు. హోం శాఖ ఈ విషయంపై ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసిందనీ, ఇక కేబినెట్ ఆమోదమే తరువాయి అనీ అంటున్నారు. అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల 1న అమరావతికి సంబంధించిన అధికారిక ప్రతిపాదనను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనల ఫలితంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తే నిధుల సమీకరణ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు రాక సులభతరం అవుతుంది.

Publish Date: Mar 30, 2026 5:13PM

political-news-img

పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం.. పీపుల్స్ పల్స్ సర్వే!

పుదుచ్చేరిలో వచ్చే నెల 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఔననే అంటోంది. 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష ఎస్పీయే 9 నుంచి11, నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని సర్వే పేర్కొంది. 9నుంచి 11స్థానాలు కైవసం చేసుకుని ఎన్.ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ బీజేపీ 5 నుంచి 7, ఎస్పీఏలో భాగస్వాములైన కాంగ్రెస్ 3నుంచి 5, డీఎంకే 6 నుంచి 8 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీయే 34 నుంచి 36 శాతం, ఎస్పీఏ 30- నుంచి 32 శాతం, టీవీకే 16నుంచి 18 శాతం ఒట్లు, ఎన్టీకే 4నుంచి 6 శాతం, వీసీకే 1నుంచి 3 శాతం, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలిసి 2 నుంచి 5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని పీలుల్స్ పల్స్ సర్వే పేర్కొంది. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ఈ సర్వేను 16-23 మార్చి, 2026 మధ్య పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 పోలింగ్ స్టేషన్లను ఎంచుకుని, ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20-25 శాంపిల్స్ ను సేకరించడం జరిగింది. ఈ సర్వేలో కులం, మతం, మహిళలు, పురుషులు, అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే నివేదికను నిఖిల్ కుమార్ రూపొందించారు. డేటా ఎనాలిసిస్ ను, ఇతర సాంకేతిక సహకారాన్ని అవెల్జెన్స్ సంస్థ అందించింది. ఎన్నికల షెడ్యూల్ ముందు ప్రతిపక్ష ఎస్పీయే కూటమి పట్ల ప్రజలు కొంత సానుకూలత చూపించినా... ఆ సానుకూలత ప్రస్తుతం కనిపించడం లేదు. టికెట్ల పంపకం తర్వాత ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే పార్టీకి కేటాయించిన సీట్లలో నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకోకపోవడంతో ఎస్పీఏకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్... డీఎంకే పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడంతో పుదుచ్చేరిలో ప్రస్తుత పరిస్థితులు ఎన్డీయేకు సానుకూలంగా మారాయి. ఎన్డీయే కూటమిలోని ప్రధాన పక్షమైన ఎన్.ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల పొత్తుల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ... దానిని అధిగమించి వారి మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఉండటం సానుకూలంగా మారింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగదు ఎస్పీఏలో కుమ్ములాటలు, సినీ నటుడు విజయ్ పార్టీ, ఓట్ల చీలిక తదితర అంశాల కారణంగా ఎన్డీయేకూ సానుకూలంగా మారుతున్నాయి. ఎన్నికల నాటికి ఎస్పీయేలో అంతర్గత విభేదాలకు తోడు ఎన్డీయే వ్యతిరేక పక్షాలు ఎక్కువ ఓట్లు చీలిస్తే అవి ఎన్డీయేకు అనుకూలంగా మారి 20 సీట్లకు పైగా గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Publish Date: Mar 30, 2026 4:30PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img