ఓటుకు 5 వందలు పంచారు.. డిస్క్వాలిఫై చేయాలి!!
Publish Date:May 18, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతోపాటే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. ఆంధ్రాలో హడావిడి అదిరిపోయే లెవల్లో జరిగింది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా గొడవలు లేవు. రిగ్గింగులు లేవు. ఆంధ్రావాళ్ళు ఇంత ప్రశాంతంగా జరిగిన పోలింగ్ని చూసి కుళ్ళుకుంటున్నారు. ఆంధ్రాలో అయితే పోలింగ్ జరిగేటప్పుడు గొడవలు.. పోలింగ్ ముగిశాక గొడవలు.. చివరికి ఫలితాలు వచ్చాక కూడా గొడవలు జరిగే అవకాశం వుందని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెబుతున్నారు. ఆంధ్రా పరిస్థితి అలా వుంటే, అదేంటో తెలంగాణలో ఎప్పుడూ తిట్టుకునే కేసీఆర్, రేవంత్ అండ్ బీజేపీ వాళ్ళు కూడా చప్పుడు లేకుండా వున్నారు. ఇదిలా వుంటే, మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన బీజేపీ నాయకుడు రఘునందనరావు పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ఓటుకు 5 వందల రూపాయలు పంచారని, అయిదేసి వందల చొప్పున ఎన్వలప్ కవర్లలో పెట్టి గ్రామాలకు పంపిణీ చేశారని రఘునందనరావు ఆరోపించారు. ఓటుకు ఐదు వందలు పంచిన నేరం మీద ఎన్నికల కమిషన్ ఆయన్ని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. అవును, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఓటుకు 5 వందలు పంచిన నేరం మీద వెంటనే డిస్క్వాలిఫై చేయాలి. అరెస్టు కూడా చేయాలి. వీలైతే, ఎన్ని సెక్షన్లు కుదిరితే అన్ని సెక్షన్లతో కేసులు పెట్టి, జీవితాంతం జైల్లో వుండేలా చేయాలి. లేకపోతే ఏమిటండీ? ఓటుకు ముష్టి ఐదు వందలు ఇస్తారా? ఎంత దారుణం? ఆంధ్రాలో వైసీపీ వాళ్ళు ఒక్కో ఓటుకు మూడు వేల దగ్గర మొదలుపెట్టి ఐదు వేల వరకు ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాలలో అయితే, తమకు రావు అనుకున్న ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి ఓటుకు పదివేలు కూడా ఇచ్చారని సమాచారం. వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి ఛార్జీలు కూడా ఇచ్చారు. ఇంత పవిత్రమైన, ఘనమైన, విలువైన ఓటుకు ముష్టి 5 వందలు ఇచ్చారంటే, ఇంతకంటే పెద్ద నేరం వుంటుందా? అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన మన పవిత్రమైన భారతదేశంలో
ఓటును ఇంత అవమానిస్తారా? ఇంత తక్కువ చేస్తారా? రఘునందనరావు గారు ఎలాగూ లాయర్ కాబట్టి, ఈ నేరానికి బహిరంగ ఉరి వేసే అవకాశం ఏమైనా వుందా అనే విషయాన్ని పరిశీలించాలి.
http://www.teluguone.com/news/content/brs-bribe-to-voters-25-176274.html