రాజకీయాలకు స్వల్ప విరామం.. ఆధ్యాత్మిక పర్యటనల్లో పవన్
Publish Date:Feb 5, 2025
Advertisement
పాలిటిక్స్ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప విరామం తీసుకున్నారా? ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఈ విరామం తీసుకున్నారా అంటే గత కొన్ని రోజులుగా ఆయన ఎక్కడా వార్తలలో వినిపించడం లేదు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలలో కనిపించడం లేదు. దీనిని బట్టి చేస్తూ ఆయన పొలిటికల్ లైఫ్ నుంచి స్వల్ప విరామం తీసుకున్నారనే చెప్పాల్సి వస్తున్నది. పార్టీ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్ వేళ్లారు. అందుకే పుంగనూరులో సభకు నాగబాబే లీడ్ తీసుకున్నారని అంటున్నారు. అయితే ఆ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా ఆయన పోలిటికల్ యాక్టివిటీస్ కంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలపైనే దృష్టి సారించారనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చాలా కాలంగా ఆయన ఆలయాల సందర్శన చేయాలని అనుకుంటున్నారనీ, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన, ఆ తరువాత హస్తిన పర్యటనల కారణంగా డిప్యూటీ సీఎంగా తాను కూడా అందుబాటులో లేకుండా ఉండటం సరికాదని భావించిన ఆయన తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సమయం చిక్కడంతో ఆయన ఆలయాల సందర్శనకు బయలుదేరుతున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్ బుధవారం (ఫిబ్రవరి 5) కేరళ పర్యటనకు బయలు దేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అనంత పద్మనాభ స్వామి ఆలయం సహా పలు ఆలయాలను సందర్శించనున్నారు. కేరళ పర్యటన అనంతరం ఆయన మూడు రోజుల పాటు తమిళనాడులో కూడా పర్యటిస్తారనీ, ఆ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను కూడా సందర్శిస్తారనీ తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/brief-break-to-politics-39-192387.html





