కుప్పకూలిన వంతెన.. యూపీలో ఆరుగురు మృతి
Publish Date:May 29, 2026
Advertisement
నిర్మాణంలో ఉన్న భారీ వంతెన కుప్పకూలి ఆరుగురు మరణించిన విషాద ఘటన ఉత్తర ప్రదేశ్ లో గురువారం (మే 28) రాత్రి జరిగింది. హమీర్పూర్ జిల్లాలో బేత్వా నదిపై నిర్మిస్తున్న ఒక భారీ వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో వంతెన కింద నిద్రిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. గురువారం (మే 29) అర్ధరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలిపోయినట్లు చెబుతున్నారు. లాల్పురా పరిధిలోని మోరాకాందర్ పరసాని నుండి కురారా లోని నైఠీ గ్రామాల మధ్య దాదాపు 1 కిలోమీటరు పొడవున ఈ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా కేవలం ఈదురుగాలులకే నిర్మాణంలో ఉన్న భారీ వంతెన తాటాకు పందిరిలా కూలిపోవడం వెనుక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నాసిరకం నిర్మాణ నాణ్యత స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ బాబూరామ్ నిషాద్ చొరవతో మంజూరైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భద్రతా ప్రమాణాలను ఎందుకు విస్మరించారనే దానిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/bridge-collapses-in-up-36-221195.html





