బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై ఎంపీ కావ్య ఆగ్రహం...పార్లమెంట్ వద్ద నిరసన
Publish Date:Apr 17, 2026
Advertisement
దేశ రాజధాని వేదికగా తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి గర్జించింది. తెలంగాణ రాష్ట్రంపై మరియు ఇక్కడి ప్రజల మనోభావాలపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో భారీ నిరసన చేపట్టారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటంపై కావ్యా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా లోక్సభలో మాట్లాడిన డాక్టర్ కడియం కావ్యా.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఏ వ్యాఖ్యలనైనా సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం గురించి కానీ, ఇక్కడి నాయకత్వం గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆమె హెచ్చరించారు. బీజేపీ అగ్రనేతలు గతంలోనూ తెలంగాణ ఏర్పాటును 'చీకటి రోజు'గా అభివర్ణించారని, ఇప్పుడు వారి బాటలోనే యువ ఎంపీలు కూడా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గురువారం రాత్రి జరిగిన చర్చలో కావ్యా తన గళాన్ని బలంగా వినిపించారు. సోనియా గాంధీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి తెలంగాణ ఇచ్చారని, అటువంటి రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బీజేపీ నైచ్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అనంతరం శుక్రవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఇతర ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవిలతో కలిసి ఆమె ధర్నాకు దిగారు. తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. సభ రికార్డుల నుంచి ఆ వివాదాస్పద వ్యాఖ్యలను తొలగించాలని కోరారు. దీనిపై స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కేవలం రాజకీయ విమర్శలే కాకుండా, ప్రజా సమస్యలపైనా కావ్యా ఢిల్లీ వేదికగా పోరాడుతున్నారు. ఇటీవల రైతుల ప్రాణాలు తీస్తున్న పారాక్వాట్ వంటి విషపూరిత పురుగుమందులను నిషేధించాలని ఆమె పార్లమెంట్లో గళమెత్తారు. అటు అభివృద్ధి, ఇటు రాష్ట్ర గౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె చర్యల ద్వారా స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై బీజేపీ ఎంపీల నుంచి స్పందన రాకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వరంగల్ ఎంపీ హెచ్చరించారు. తెలంగాణ సెంటిమెంట్తో ఆడుకుంటే రాజకీయంగా పుట్టగతులు ఉండవని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసన సెగ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తోంది.
http://www.teluguone.com/news/content/bjp-mp-tejaswi-surya-36-217592.html





