జగన్ కు మద్దతు.. తెలుగుదేశం, జనసేనతో పొత్తు.. బీజేపీ కొంపే మునుగుతుంది?!
Publish Date:May 3, 2024
Advertisement
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు. రెండు దశలలో కలిపి మొత్తం190 లోక్ సభ నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది. ఈ 190 నియోజకవర్గాలలో బీజేపీ కనీసం సగం స్థానాలలో కూడా విజయం సాధించే అవకాశాలు లేవని అంటున్నారు. అదే సమయంలో విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గణనీయంగా పుంజుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితికి కారణం పూర్తిగా మోడీ అహంభావ వైఖరి, ఏకపక్ష నిర్ణయాలే కారణమని కూడా అంటున్నారు. ఇప్పుడిక బీజేపీకి ఏమూలనైనా ముచ్చటగా మూడో సారి అధికారం అన్న ఆశలు మిగలాలంటే ఆ పార్టీ ఉత్తరాదిలో మంచి ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ పరిస్థితి లేదన్నది అందరికీ తెలిసిందే. బీజేపీకి దక్షిణాదిలో ఏమైనా ఆశలున్నాయంటే అవి కర్నాటక, తమిళనాడులపై మాత్రమే. అయితే తమిళనాడులో తొలి దశలోనే ఓటింగ్ పూర్తయ్యింది. ఇలా ఓటింగ్ ముగిసిందో లేదో అలా బీజేపీ తమిళనాడు ఆశలు గల్లంతయ్యాయి. ఆ రాష్ట్రంలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందన్న నమ్మకాలు లేవనీ కమలనాథులే చెబుతున్నారు. ఇక కర్నాటక. ఇటీవల కర్నాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. ఆ రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీ చేసిన ప్రయోగాలు, సొంత నేతలను కాదని బయటి పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేసిన తీరుతో కర్నాటకలో కమలం రేకలు ఊడిపోయాయి. దీంతో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధించే అవకాశాలు మృగ్యమనే అంటున్నాయి. ఇక తెలంగాణలో మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఒకింత పుంజుకుని కొన్ని స్థానాలను కైవశం చేసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. గత లోక్ సభ ఎన్నికలలో బీజేపీకి తెలంగాణలో నాలుగు లోక్ సభ స్థానాలు దక్కాయి. ఒక అంచనా ప్రకారం ఈ సారి ఎన్నికలలో ఆ పార్టీ ఐదు నుంచి ఆరు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. ఇక కేరళలో బీజేపీ బోణీ కొట్టే అవకాశాలే లేవన్నది ఆ పార్టీయే చెబుతోంది. ఇఖ దక్షిణాదిలో ఆ పార్టీ భారీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏపీలో వాస్తవానికి బీజేపీకి కనీసం ఒక శాతం కూడా ఓటు స్టేక్ లేదు. అయితే ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా తెలుగుదేశం, జనసేనలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. దాదాపు ళ్ల తరువాత తెలుగుదేశం ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీగా అవతరించింది. ఇందుకు కారణాలపై పెద్దగా శోధన అవసరం లేదు. 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీని కేంద్రంలో అధకారంలో ఉన్న బీజేపీ అష్టదిగ్బంధనంలో బంధించేసింది. అప్పటి విపక్ష వైసీపీకి అనుకూలంగా పావులు కదిపింది. ఎన్నికల సంఘం వైసీపీ ఫిర్యాదు చేయడం ఆలస్యం అన్నట్లుగా ఆఘమేఘాల మీద చర్యలు తీసుకుంది. సీఎస్, ఇంటెలిజెన్స్ ఏడీజీ వంటి వారిపై వేటు వేసింది. ఎన్నికల సమయంలో వైసీపీ యథేచ్ఛగా దాడులకు, బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడినా సాక్షాత్తూ తెలుగుదేశం అభ్యర్థులపై దాడులు జరిగినా ఎన్నికల సంఘం కన్నెత్తి చూడలేదు. చర్యల ఊసెత్తలేదు. దీంతో అప్పటి ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. సరిగ్గా ఐదేళ్ల తరువాత తమకు అంతా సానుకూలంగా ఉన్న పరిస్థితులలో గత ఎన్నికల నాటి అరాచకత్వం మరోసారి తలెత్తకుండా ఉండాలంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉంటే మేలని భావించి.. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయ్యింది. అయితే వ్రతమూ చెడింది.. ఫలమూ దక్కలేదన్నట్లు పొత్తులో భాగంగా బీజేపీ తన వాస్తవ బలాన్ని పట్టించుకోకుండా సీట్ల కోసం పట్టుబట్టి సాధించుకుంది. అయితే ఫెయిర్ అండ్ ఫ్రీ ఎన్నికలు జరుగుతాయన్న ఉద్దేశంతో తెలుగుదేశం కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడి బీజేపీ కోరినన్ని సీట్లను పొత్తులో భాగంగా కమలం పార్టీకి కట్టబెట్టింది. అయితే బీజేపీ వైపు నుంచి పొత్తు ధర్మాన్ని పాటిస్తున్న సూచనలు ఇసుమంతైనా కనిపించడం లేదు. గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా సహకారం అందించి, అడిగిందే తడవుగా అప్పులకు అనుమతులిచ్చి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకోకుండా వ్యవహరించిన మోడీ సర్కార్, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కూటమిలో పొత్తు బంధం ఉన్నా కూడా ఆ తెరచాటు బంధాన్ని కొనసాగిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నిబంధనలను ఏపీలోని అధికార వైసీపీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్నది కమల మహత్మ్యమేనన్న భావన సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతోంది. అయితే ఈ వైఖరి వల్ల బీజేపీయే భారీగా నష్టపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై ప్రజావ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో తొలి రెండు దశల్లో జరిగిన పోలింగ్ లో తేటతెల్లమైంది. అలాగే గత ఐదేళ్లుగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై అంతకు మూడింతలు యాంటీ ఇంకంబెన్సీ ఉంది. బీజేపీ ఇటు తెలుగుదేశం, జనసేనలతో పొత్తులో ఉండి, అటు వైసీపీతోనూ దోస్తీ కొనసాగిస్తున్నట్లుగా జనం భావిస్తున్నారు. బీజేపీ తీరు మార్చుకోకుంటే.. తెలుగుదేశం, జనసేన ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకాశం ఉండదు. అయితే అదే సమయంలో జనసేన తెలుగుదేశం ఓట్లు పరస్పరం బదిలీ అవ్వడమే కాకుండా బీజేపీ ఓటు కూడా ఆ రెండు పార్టీలకూ ట్రాన్స్ ఫర్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీని వల్ల బీజేపీకే భారీ నష్టం వాటిల్లుతుందనీ, పంతం పట్టి మరీ సాధించుకున్న స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులు మళ్లీ నోటాతో పోటీ పడే పరిస్థితే వస్తుందంటున్నారు. ఆదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా చెబుతున్నారు. జీవీఎల్, సోము వీర్రాజు వంటి ఒకరిద్దరిని మినహాయిస్తే రాష్ట్ర నాయకత్వంమొత్తం అధిష్ఠానం తీరు పట్ల అసంతృప్తిగా ఉంది. బీజేపీ అధినాయకత్వం ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ సంఘటనా మహామంత్రి బీఎల్ సంతోష్జీకి రాష్ట్ర నేతలు లేఖ కూడా రాశారు. ఇప్పటికే బీజేపీ తీరు పట్ల కూటమి పార్టీలయిన తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోందని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. పోలింగ్ పది రోజుల వ్యవధిలోకి వచ్చేసినా ఇంకా ఇన్ చార్జి డీజీపీ, సీఎస్ లపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడంతో, బీజేపీ అధినాయకత్వం ఇప్పటికీ ఇంకా జగన్ ప్రభావంలోనే ఉన్నారని తెలుగుదేశం, జనసేన శ్రేణులు భావిస్తున్నాయని, ఇది ఇంకా ఇలాగే కొనసాగితే అది బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీల విజయావకాశాలను దారుణంగా దెబ్బతీయడం ఖాయమనీ వారా లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/bjp-high-command-violate-alliance-unity-25-175058.html