బీహార్ ఎన్నికలు.. పీకే కు పరీక్ష.. రాగాకు అగ్ని పరీక్ష!
Publish Date:May 20, 2025

Advertisement
బీహార్ శాసనసభ ఎన్నికలు వేగంగా కదులుతున్న ఋతుపవనాలను మించిన వేగంగా తరుము కొస్తున్నాయి. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ సహజంగానే రాజకీయ వేడి పెరుగుతోంది. నిజానికి ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం బీహార్ కు మాత్రమే పరిమితమైన ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం దేశ రాజకీయ గతిని మార్చివేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ఇంచుమించుగా ఒకదశాబ్ద కాలానికి పైగా దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ కి పరీక్షగా నిలిచే ఈ ఎన్నికలు, కులగణనను రాజకీయ తారక మంత్రాన్ని నమ్ముకున్న రాహుల్ గాంధీకి అగ్ని పరీక్షగా నిలుస్తాయని అంటున్నారు. వివరాల్లోకి వెళితే ..
బీహార్ శాసన సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ఈ సంవత్సరం చివర్లో, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికల జరగనున్న రాష్ట్రంలో అధికారాన్ని నిలుపునేందుకు బీజేపీ సారథ్యంలో ఎన్డీఎ కూటమి, అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి పోటీ పడుతున్నాయి. మరో వంక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్’ స్థాపించిన జన సురాజ్ పార్టీ తొలి సారిగా ఎన్నికల బరిలో దిగుతోంది. సో , ఇంతవరకు రాజకీయ పార్టీలకు ఎన్నికల పాఠాలు చెప్పిన ప్రశాంత్ కిశోర్ కు ఈ ఎన్నికలు పరీక్ష కానున్నాయి.
అదలా ఉంటే.. కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే వల్లె వేస్తున్న,కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి తారక మంత్రంగా భావిస్తున్న కులగణన ప్రభావం జాతీయ రాజకీయాలపై ఏ మేరకు ఉంటుంది అనేది కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుందని అంటున్నారు. కులగణనకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన తర్వాత జరుగతున్న తొలి ఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలే కావడంతో దేశ భవిష్యత్ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ ఖాతాలో వేసుకున్నట్లుగా,కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయం క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న రాహుల్ గాంధీకి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అగ్నిపరీక్ష కాగలవని పరిశీలకులు అంటున్నారు.
కాగా.. జన్సురాజ్ పార్టీ గత ఏడాది నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది. నాలుగు స్థానాలలోనూ ఓడి పోయింది. అంతే కాదు ఒక్క సీటు మినహా మిగిలిన మూడు నియోజక వర్గాల్లో డిపాజిట్ కూడా కోల్పోయింది. అయితే తొలి ప్రయత్నంలోనే పది శాతం ఓట్లు తెచ్చుకుంది. జన సురాజ్ పది శాతం ఓట్లు పట్టుకు పోవడం కమలానికి కలిసోచ్చింది. బీజేపీ తమ సిట్టింగ్ సీటు (ఇమామ్గంజ్)తో పాటుగా ఇండియా కూటమి మూడు సిట్టింగ్ స్థానాలు (తరారి, రామ్గఢ్, బెలగంజ్) మొత్తం నాలుగు స్థానాలను గెలుచుకుంది. సో.. ఇదే లెక్క రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పనిచేస్తే.. ఎన్డీఎ గెలుపు మరింత సులువు అవుతుంది. అంతకంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకగా మారుతుందని అంటున్నారు.
అదలా ఉంటే, గత ఏడాది (2024) అక్టోబర్ 2న జన్ సురాజ్ పార్టీని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ ఇంతవరకు పూర్తి స్థాయి అధ్యక్షుడు లేకుండానే పార్టీని ఒంటి చేతితో నడిపించారు. అయితే.. ఇప్పడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ, భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. అంతే కాదు పార్టీలో తాను ఎలాంటి పదవుల్లోనూ ఉండటం లేదని స్పష్టం చేశారు. పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ ఐపీఎస్ అధికారి మనోజ్ భారతిని నియమించారు. దీంతో పీకే వ్యూహం ఏమిటి? అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. అలాగే.. ఎన్నికల ప్రకటన వెలువడితే గానీ, అసలు చిత్రం తెర పైకి రాదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/bihar-elections-a-big-test-to-pk-and-rahul-39-198375.html












