బీహార్ లో జనతా పరివార్ కే విజయావకాశాలు
Publish Date:Sep 10, 2015
Advertisement
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుండే ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడి మొదలయిపోయింది. ఇప్పుడు ఎన్నికల గంట కూడా మ్రోగింది. ఈ ఎన్నికలలో ఏ పార్టీ లేదా ఏ కూటమి విజయం సాధిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. అందుకే వివిధ మీడియా సంస్థలు సర్వేలు మొదలుపెట్టేశాయి. ఇండియా టీవీ-సి ఓటర్ అనే రెండు సంస్థలు నిర్వహించిన తాజా సర్వే ప్రకారం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు కలిసి ఏర్పాటు చేసుకొన్న జనతా పరివార్ కూటమి, దానితో జత కట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలున్నట్లు వెల్లడయింది. మొత్తం 243 సీట్లలో జనత పరివార్ 116-132 సీట్లు వరకు గెలుచుకోవచ్చునని తెలిపింది. ఎన్డీయే కూటమికి సుమారు 94-110 సీట్లు వరకు రావచ్చని తెలిపింది. ఆగస్ట్ నెలాఖరు-సెప్టెంబర్ మొదటి వారంలో బీహార్ లోని మొత్తం 243 నియోజక వర్గాలలో సర్వే నిర్వహించి మొత్తం 10,638 మందిని ఇంటర్వ్యూ చేసి ఈ వివరాలు సేకరించినట్లు తెలిపింది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలలో ఊహించని చాలా పరిణామాలు జరిగే అవకాశం ఉంది కనుక ఈ ఓటర్ల ఆలోచనా సరళి కూడా మారే అవకాశం ఉంది. జనతా పరివార్, ఎన్డీయే కూటములలో లుకలుకలు, ములాయం సింగ్ ఒంటరిగా బరిలోకి దిగడం, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ప్రకటించిన భారీ ఆర్ధిక ప్యాకేజీ, పార్టీల ప్రచార వ్యూహాలు వంటి అనేక అంశాలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అదీ గాక ఎన్నికలు ఐదు దశలలో జరుగుతున్నందున పార్టీల జయాపజయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. ఏమయినప్పటికీ నవంబర్ 8న ఫలితాలు వెలువడే వరకు ఈ ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.
http://www.teluguone.com/news/content/bihar-45-49923.html