బనకచర్ల వివాదంలో..ఏపీ, తెలంగాణ వాదనలేంటి?
Publish Date:Jun 17, 2025

Advertisement
బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే ఈ దిశగా.. ఒక అఖిలపక్షం ఏర్పాటు చేయగా.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎంపీలను ఆహ్వానించింది. మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ప్రత్యేక ఆహ్వానం పలకడం మాత్రమే కాదు వారి వారికి ఫోన్లు చేసి మరీ ఆహ్వానించారు తెలంగాణ నీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ దిశగా ఆయన ఇప్పటికే కేంద్రానికి ఎన్నో లేఖలు కూడా రాశారు. ఏపీ ప్రభుత్వ బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వరాదంటూ కోరుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇదిలా ఉంటే ఏపీ సైతం ఒక ప్రెజంటేషన్ ఇచ్చింది. అసలు బనకచర్లకూ తెలంగాణకు సంబంధమేంటి? మేమేమైనా మీ ప్రాజెక్టులు ఆపామా? అయినా ఎగువ రాష్ట్రం కట్టే ప్రాజెక్టులకే అభ్యంతరాలు తెలపాలి. దిగువన ఉన్న రాష్ట్రం విషయంలో నష్టపోయేవారెవరని? ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయ్. మరి ఆ నీటినే మేం వాడుకోదలుచుకున్నాం. రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరందించే యత్నం చేస్తున్నామంటోంది ఏపీ. దేశంలోనే రెండో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతమైన అనంతపురానికి.. నీరందించడం తప్పెలా అవుతుందన్నది- ఏపీ నీటి మంత్రి నిమ్మల సంధిస్తోన్న ప్రశ్నాస్త్రం.
ఇదిలా ఉంటే బనకచర్ల ప్రాజెక్టును 80 వేల కోట్ల రూపాయలతో నిర్మించడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది ఏపీ. పోలవరం లింక్ ప్రాజెక్ట్ అయిన దీనికోసం ఇప్పటికే కేంద్రానికి అనుమతుల కోసం అప్లై చేసుకుంది. గతంలో ఇదే ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సైతం సమ్మతించారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటానంటూ ఆయన అన్న మాటలను తన ప్రెజంటేషన్లో పొందు పరిచారు నిమ్మల. అంతే కాదు కేసీఆర్ ఉదారత గురించి జగన్ చేసిన కామెంట్లను కూడా తన ప్రెజంటేషన్ ద్వారా ప్రస్తావించారు మంత్రి. రాయలసీమ బిడ్డగా చెప్పుకు తిరిగే జగన్.. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ను ఎందుకు వ్యతిరేకించడం లేదన్నది మంత్రి సూటిగా వేస్తోన్న ప్రశ్న.
ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టు విషయంలో అంటున్న మాటేంటో చూస్తే.. కృష్ణాజలాల విషయంలో పోతిరెడ్డిపాడు ఎలాంటిదో.. గోదావరి జలాల విషయంలో బనకచర్ల అలాంటిదని అంటారు మాజీ నీటి పారుదల మంత్రి హరీష్ రావు. ఇక కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రులను ఆడిపోసుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి. అభ్యంతరాలుంటే కేంద్రానికి చెప్పుకోవాలి. మధ్యలో మా ప్రమేయం ఏముంటుందని అంటారాయన.
ఈ విషయంలో నిపుణులు అంటోన్న మాటలేంటని చూస్తే.. ఇప్పటికే గోదావరి పై తెలంగాణలో నాలుగు ప్రాజెక్టులకు చెందిన డీపీఆర్లు పెండింగ్ లో ఉన్నాయని అంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇలాంటి ప్రాజెక్టులకు అసలు ఎలాంటి అనుమతులు అక్కర్లేదని అంటారు ఏపీ ఇరిగేషన్ నిపుణులు. ఇది నాడు కేఎల్ రావు చెప్పిన నదుల అనుసంధానానికి చెందిన ప్రాజెక్ట్. ప్రధాని మోడీ సైతం నదుల అనుసంధానం చేయాలంటారు. ఇక 1980 నాటి ట్రిబ్యునల్ తీర్పులుగానీ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 గానీ ఉల్లంఘించడం లేదు. ఎందుకంటే ఆ తీర్పులన్నీ నికర జలాలపైన వచ్చినవి. తామేమీ వాటి జోలికి పోవడం లేదే.. వరద నీరు వృధాగా పోకుండా సద్వినియోగం చేస్తున్నాం. 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద నీటి కారణంగా కోటి మందికి పైగా ముంపునకు గురయ్యారు. దీన్ని నివారించడానికే ఇదంతా అంటారు ఏపీ ఇరిగేషన్ నిపుణులు. ఇపుడీ బనకచర్ల గొడవ ఎటు పోయేట్టు? రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం ఎప్పుడు ముగిసేను? తేలాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/banakacharla-39-200175.html












