బాబూస్ మొగ్గు బాబు వైపే!
Publish Date:Jun 6, 2023

Advertisement
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది. అయితే జనం మూడ్ ఏమిటన్నది తెలుసుకోవడానికి ఎలాంటి సర్వేలూ అవసరం లేదు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయం అందరికంటే ముందే పసిగట్టేసే బ్యాచ్ ఒకటి ప్రతి రాష్ట్రంలోనూ ఉంటుంది. ఆ బ్యాచే ఐఏఎస్ ల బ్యాచ్. రాజకీయ పరిభాషలో వారే బాబూస్.
అధికారంలో ఉన్న పార్టీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో లేదో వాళ్లు ఇట్టే పసిగట్టేయగలరు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మరో సారి గద్దె నెక్కే పరిస్థితి లేదని పసిగట్టిన వెంటనే వారి విధేయతలు మారిపోతాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో అధినేతలు చెప్పినట్లు నడుచుకుంటూనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి గద్దెనెక్కే పార్టీ నాయకుడితో సత్సంబంధాలు నెరపడం మొదలు పెట్టేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారుల తీరు గమనిస్తే రాబోయే ప్రభుత్వం ఎవరిదన్నది ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది.
నాలుగేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు సాధ్యమైనంతగా ప్రభుత్వానికి దూరం జరుగుతున్నారు. ఇంత కాలం చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా ప్రభుత్వం ఇంత చెప్తే అంత చేసి విపక్షాన్ని చీకాకు పెట్టేందుకు మాత్రమే తమ అధికారాన్ని వాడిన అధికారులంతా.. ఇప్పుడు విపక్ష నేత కరుణా కటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు కాస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాలుగేళ్లుగా జగన్ కరుణా కటాక్షాల కోసం పరిధి దాటి మరీ పనులు చేసిన కొందరు అధికారులు ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తే చాలు.. గప్ చిప్ గా తెలంగాణ రాజధానికి చేరుకుంటున్నారు. రహస్యంగా ఆయనతో భేటీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో తాము వ్యవహరించిన తీరుకు క్షమాపణలకు కోరుకోవడమే కాదు.. అలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ కూడా ఇస్తున్నారు.
జగన్ సర్కార్ ఒత్తిడితోనే తాము తెలుగుదేవం పార్టీకి వ్యతిరేకంగా పని చేయాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. బరితెగించి మరీ ఇంత కాలం జగన్ కు భజన చేసిన అధికారులే ఇప్పడు బాబు ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నారు. ఈ తీరే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనలు సక్సెస్ కావడం, అదే సమయంలో సీఎం జగన్ సహా, వైసీపీ చేపట్టిన కార్యక్రమాలపై జనం విముఖత చూపుతుండటం.. జగన్ సభల నుంచే జనం పారారౌతున్న పరిస్థితి, గడపగడపకు లో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజా నిరసన ఎదురు అవుతుండటంతో అధికారులకు విషయం అర్ధమైపోయింది. తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు అన్నది నిర్ధారణ అయిపోవడంతో జగన్ కు ఒక్క చాన్సే లాస్ట్ చాన్స్ అనీ మరో చాన్స్ అసాధ్యం అనీ స్పష్టత వచ్చేసింది. దీంతో వచ్చేది తెలుగుదేశం సర్కారేనని నిర్ధారించుకున్న బాబూస్ ప్లేట్ ఫిరాయించేందుకు రెడీ అవుతున్నారు.
నిబంధనల మేరకు నడుచుకున్న అధికారులు యథావిథిగా తమ ఉద్యోగ ధర్మం తాము నిర్వర్తిస్తుంటే.. పరిధి దాటి ఎక్స్ ట్రాలు చేసిన వారు మాత్రం ఇప్పడు గాభరా పడుతున్నారు. వచ్చే ప్రభుత్వం తమపై చర్యలు తీసుకోవడం ఖాయమని భయపడుతున్నారు. అందుకే ముందుగానే తమ ఎక్స్ ట్రాలకు కారణాలను చంద్రబాబుకు వివరణ ఇచ్చుకుని కొంచెం సేఫ్ జోన్ లోకి వెళ్లేందుకు తాపత్రేయ పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హైదరాబాద్లో చంద్రబాబుని రహస్యంగా కలిశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో తాము అడ్డగోలు నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదని చంద్రబాబు ముందు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారని అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తాము నిర్వర్తించిన విధులు, తమ ప్రతిభను గుర్తు చేస్తూ గత నాలుగేళ్లుగా తమ పనితీరు అధ్వానంగా ఉండటానికి కారణం జగన్ సర్కార్ అసమర్థతా, అనుచిత ఒత్తిడే కారణమని వివరణ ఇచ్చుకుంటున్నారు.
అలాగే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మొహం చాటేసిన సీనియర్ నేతలు కూడా ఇప్పుడు మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు అడుగులు కదుపుతున్నారు. అవకాశం దొరికితే చంద్రబాబును కలిసి తాము ఇంత కాలం ఒకింత సైలెన్స్ మెయిన్ టైన్ చేయడానికి కారణాలను చెప్పుకుని మళ్లీ పార్టీలో పూర్వపు స్థానాన్ని పదిలపరుచుకోవడానికి ప్రయత్నాలు ఆరంభించేశారు. వీలైతే చంద్రబాబును, కుదరకపోతే లోకేష్ ను కలిసి తాము ఇకపై యాక్టివ్ గా ఉంటామని నమ్మబలుకుతున్నారు.
మరీ ముఖ్యంగా యువగళం పాదయాత్రలో వారు చురుకుగా కనిపిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా లోకేష్ తో కలిసి అడుగులు వేస్తున్నారు. ఇప్పడు నారా లోకేష్ పాదయాత్ర వారికి తమ పలుకుబడిని ప్రదర్వించేందుకు ఒక అవకాశంగా లభించిదని భావిస్తున్నారు. అలాగే వివిధ కారణాల వల్ల పార్టీ మారిన వారు మళ్లీ తెలుగుదేశం గూటికి చేరేందుకు తమదైన శైలిలో, స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించేశారు.
http://www.teluguone.com/news/content/babus-disclosed-which-party-comes-to-power-39-156420.html












