నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు.. బీహార్ లో 3వేల మందికి పైగా ఉపాధ్యాయులపై వేటు.!
Publish Date:Jul 9, 2026
Advertisement
బీహార్ విద్యాశాఖ చరిత్రలోనే భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నకిలీ పట్టాలు, ఫోర్జరీ చేసిన విద్యా ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, మోసపూరిత మార్గాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన వారిపై ఉక్కుపాదం మోపింది. సుదీర్ఘ కాలంగా సాగిన విచారణ అనంతరం ఏకంగా 3 వేల 35 మంది టీచర్లను ఒకేసారి విధుల్లోంచి తొలగిస్తూ బీహార్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 నుండి 2015 మధ్య కాలంలో జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రభుత్వం సం రాష్ట్ర విజిలెన్స్ బ్యూరోతో సమగ్ర విచారణ జరిపించింది. విజిలెన్స్ అధికారులు తమ దర్యాప్తులో ఆ కాలంలో నియమితులైన ప్రతి ఉపాధ్యాయుడి సర్టిఫికెట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సుదీర్ఘ విచారణ ముగిసిన తర్వాత విజిలెన్స్ బ్యూరో సమర్పించిన అ నివేదిక ఆధారంగా విద్యాశాఖ మూడు వేల మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు అధికారులను విస్మయపరిచాయి. చాలామంది అభ్యర్థులు అసలు ఉనికిలోనే లేని నకిలీ కాలేజీల పేరుతో సర్టిఫికెట్లను సృష్టించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. అలాగే కొందరు ఒరిజినల్ సర్టిఫికెట్లను కంప్యూటర్ల సాయంతో ఫోర్జరీ చేసి ప్రభుత్వ కొలువులు దక్కించుకున్నట్లు వెల్లడైంది. ఈ అక్రమాలకు పాల్పడిన నిందితులపై ప్రభుత్వం కేవలం శాఖాపరమైన చర్యలతో సరిపెట్టలేదు. ఈ కుంభకోణంలో నిందితులుగా తేలిన 3,035 మంది ఉపాధ్యాయులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 1,830 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అంతే కాకుండా ఉద్యోగాల నుండి తొలగించడమే కాకుండా, వీరు సర్వీసులో ఉన్న కాలంలో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన ప్రతి రూపాయిని తిరిగి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు విద్యాశాఖ రికవరీకి ఆదేశాలు జారీ చేసింది. Bihar fake teachers, bihar education department, Dismisses teachers, fake certificate scam, vigilance bureau investigation,
http://www.teluguone.com/news/content/axe-on-fake-teachers-36-225566.html





