కుమార్తెను ముందుపెట్టి అవంతి శ్రీనివాస్ పొలిటికల్ స్కెచ్!
Publish Date:Apr 30, 2025
.webp)
Advertisement
వైసీపీకి షాక్ ఇచ్చిన తండ్రీకూతుళ్లు
ఎన్నికల తర్వాత విశాఖలో ఇద్దరు నాయకులు వైసీపీకి గట్టి దెబ్బ కొట్టారు... ఎన్నికల్లో ఓటమి చెందిన వెంటనే క్షణం ఆలోచించకుండా పార్టీ పదవులకు రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చారు మాజీమంత్రి అవంతి శ్రీనివాస్. వైసిపి నుంచి కార్పొరేటర్ గా గెలిచిన కీలకమైన సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసr కోలుకోలేని దెబ్బ కొట్టారు ఆయన కుమార్తె లక్ష్మీ ప్రియాంక. తండ్రి చేసిన పనికి ఓ పక్క భీమిలీ నియోజకవర్గంలో వైసీపీకి మనుగడే కరువైనట్లు కనిపిస్తుంటే మరోపక్క కూతురు చేసిన పనికి వైసీపీ విశాఖ మేయర్ పదవి కోల్పోవాల్సి వచ్చింది.
అవంతి శ్రీనివాస్తో పాటు ఆయన కూతురు లక్ష్మీ ప్రియాంక గురించి కూడా విశాఖలో జోరుగా చర్చ సాగుతుంది . 2009ల రాజకీయాల్లోకి వచ్చి పీఆర్పీ నుంచి పోటీ చేసి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన అవంతి శ్రీనివాస్, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచి పార్లమెంట్కి వెళ్లారు. 2019 ఎన్నికల్లో మళ్లీ భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
ప్రస్తుత భీమిలి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు రాజకీయ శిష్యుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి శ్రీనివాస్ వరుస విజయాలతో గురువులాగే లక్కీ పొలిటీషియన్ అనిపించుకున్నారు. చివరికి గత ఎన్నికల్లో తన గురువు గంటా చేతిలోనే అవంతి శ్రీనివాస్ భీమిలిలో ఓటమి పాలయ్యారు. ఈ పదహారేళ్లలో పీఆర్పీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలను చుట్టేసిన అవంతి శ్రీనివాస్ 2024 ఎన్నికల తర్వాత వైసీపీ పదవులకు రాజీనామా చేసి సైలెంట్ గా కాలం గడిపేస్తున్నారు... భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఓడిపోయిన తర్వాత మూడు నెలలు తిరగకుండానే పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ పార్టీపై ఆరోపణలు చేసి మరీ బయటకు వచ్చేశారు.
ఊహించని విధంగా అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడం, పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతూ తీవ్రమైన విమర్శలు చేయడంతో భీమిలి నియోజకవర్గంలోనే కాక ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా వైసీపీ మీద నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఇది అవంతి ఫ్యామిలీ నుంచి వైసీపీకి తగిలిన మొదటి దెబ్బ అని చెప్పవచ్చు. అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసిన ఆరు నెలల తర్వాత అప్పటివరకు సైలెంట్గా ఉన్న భీమిలి నియోజకవర్గం లోని ఆరో డివిజన్ కార్పొరేటర్ లక్ష్మి ప్రియాంక వైసీపీని ఊహించని దెబ్బ కొట్టారు. విశాఖ మేయర్ ఫై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకున్న కూటమి పార్టీలు వైసీపీ నుండి జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్లు అందరికీ గేట్లు తెరిచాయి.
మేయర్ పై అవిశ్వాసం పెట్టడానికి కోరం సరిపోకపోయినా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో అటు వైసీపీ, కూటమి పార్టీలు నెలరోజులు క్యాంపు రాజకీయాలు నడిపాయి. ఈనెల 19వ తేదీన అవిశ్వాస తీర్మానం డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వైసీపీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్లు టిడిపి, జనసేన పార్టీలో జాయిన్ అవ్వడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కావలసిన కోరం 74 మ్యాజిక్ ఫిగర్ సరిపోయిందని అంతా అనుకున్నారు. అయితే పార్టీ మారి వచ్చిన ఒక వైసీపీ కార్పొరేటర్ ఊగిసలాట ధోరణి ప్రదర్శించడంతో కూటమి పార్టీల్లో టెన్షన్ కనిపించింది.
అయితే అవిశ్వాస తీర్మానానికి అరగంట ముందు విశాఖ మేయర్ పదవి కూటమికి దక్కడంలో అవంతి శ్రీనివాస్ కుమార్తె వైసీపీ కార్పొరేటర్ లక్ష్మి ప్రియాంక మెయిన్ రూల్ పోషించి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ప్రియాంక ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వకుండా కూటమికి అనుకూలంగా ఓటు వేయడం వైసీపీ పెద్దలకు పెద్ద షాకే ఇచ్చింది. అప్పటివరకు వైసీపీ కార్పొరేటర్గా ఉన్న లక్ష్మీ ప్రియాంక ఎవరు ఊహించిన విధంగా కూటమి పార్టీకి అనుకూలంగా ఓటు వేయడంతో వైసీపీ విశాఖ మేయర్ పదవిని కోల్పోయింది. అవంతి శ్రీనివాస్ ఫ్యామిలీ నుండి వైసీపీకి తగిలిన రెండో షాక్ అది.
ఒకే కుటుంబం నుండి రెండు షాక్లు తగిలి విశాఖలో వైసీపీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారడంతో పార్టీ పెద్దలు ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో? అర్థంకాక సతమవుతమవుతున్నారంట. ఆ క్రమంలో అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రయాణం ఎటువైపు అనే చర్చ మొదలైంది.వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ గత ఆరు నెలలుగా ఖాళీగానే ఉన్నారు. ఏ పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా తన వ్యాపారాలు చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్, చంద్రబాబు, నారా లోకేష్ లపై అవంతి నిత్యం విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ ఎఫెక్ట్తో ఆయనకు టీడీపీ, జనసేనల్లో చేరడానికి దారులు మూసుకుపోయాయంటున్నారు.
ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు అవంతి తన రాజకీయ గురువు గంట శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గంట తో పాటు చంద్రబాబు లోకేష్లపై తరచూ విమర్శలు చేసిన అవంతి టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వకుండా గంట పావులు కదుపుతున్నారంట. గంట మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు కావడంతో జనసేనలో అవంతి చేరడానికి కూడా అవకాశం లేదంటున్నారు. అదీకాక గతంలో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు గుప్పించడంపై జనసైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
అవంతికి ఏ పార్టీలోకి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో తన కూతురు లక్ష్మీ ప్రియాంక ద్వారా కొత్త రాజకీయ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూటమిలోని టిడిపి, జనసేన పార్టీలు అడగకపోయినా స్వచ్ఛందంగా కౌన్సిల్కి వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన లక్ష్మీ ప్రియాంక ఈ రెండు పార్టీలకు దగ్గరవ్వడానికే ఆ పని చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా జనసేనకి దగ్గరై రానున్న రోజుల్లో ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారంట. అందుకే లక్ష్మీ ప్రియాంక ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వకుండా సైలెంట్ గా వచ్చి కూటమికి అనుకూలంగా ఓటు వేసి కూటమి పార్టీల గుడ్లుక్స్లో పడే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మొదటిసారి కార్పొరేటర్గా గెలిచిన లక్ష్మీ ప్రియాంకకు ఇంత ఆలోచన లేకపోయినా .. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన తండ్రి అవంతి శ్రీనివాస్ తమ రాజకీయ భవిష్యత్తు కోసం కుమార్తెను కూటమికి దగ్గర చేసే ఆలోచనతో ఓటు వేయించినట్లు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఆ తండ్రి కూతుళ్లు ఏ పార్టీలో చేరే అవకాశం లేకపోయినా, భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన సమయానికి కచ్చితంగా తమకు అవకాశం వస్తుందని వారు భావిస్తున్నారంట. మరి అవంతి శ్రీనివాస్, లక్ష్మీ ప్రియాంకల ఆలోచనలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
http://www.teluguone.com/news/content/avanti-srinivas--political-sketch-39-197218.html












