అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం.. ఏపీ ప్రభుత్వం రోడ్మ్యాప్!
Publish Date:Jul 8, 2026
Advertisement
దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న అగ్రీగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. పదేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని, తాము దాచుకున్న ప్రతి పైసా తిరిగి వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న అగ్రీగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులన్నిటినీ వేగంగా పరిష్కరించి.. ఆరు నెలల వ్యవధిలోనే సొమ్ములు బాధితులకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అగ్రీగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను ఆరు నెలలలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేలం ద్వారా వచ్చే నిధులతో బాధితులకు నేరుగా డబ్బులు చెల్లించేలా ఒక స్పష్టమైన, పారదర్శరమైన కార్యాచరణను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెడీ చేసింది. సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ నేరుగా పాల్గొనగా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి, కేసుల విచారణ వేగవంతం కావడానికి ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటుతో పాటు, ప్రతి 15 రోజులకోసారి ఈ మంత్రుల కమిటీ సమావేశమై పురోగతిని సమీక్షించాలని ఈ భేటీ నిర్ణయించింది. ప్రభుత్వ లేక్కల మేరకు.. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా సుమారు 11.57 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు. వీరందరికీ కలిపి మొత్తం 3 వేల 944 కోట్లు చెల్లించడమే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం ఈ రోడ్మ్యాప్ను రూపొందించింది. అగ్రిగోల్డ్కు చెందిన వేలాది కోట్ల విలువైన ఆస్తుల పరిరక్షణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 23 వేల 599 ఎకరాల భూములను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ భూములన్నింటినీ పూర్తిగా జియో ట్యాగింగ్ చేయడం ద్వారా రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచనున్నారు. తద్వారా ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఆస్తులను కాపాడనున్నారు. మరోవైపు సీఐడీ దర్యాప్తులో సుమారు 2 వేల కోట్ల రూపాయల విలువైన బాండ్లు ఏజెంట్ల వద్దనే ఉండిపోయినట్లు గుర్తించారు. ఈ నకిలీ లేదా హోల్డ్ లో ఉన్న బాండ్లను నెలరోజుల్లో పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. AP Government roadmap, AgriGold victims repayment, Vangalapudi Anitha, Nadendla Manohar, Telugunews
http://www.teluguone.com/news/content/auction-of-agrigold-assets-36-225344.html





