కొమ్మినేని, కృష్ణంరాజుపై డీజీపీకి రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు
Publish Date:Jun 7, 2025

Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఒక న్యూస్ చానెల్ లో శుక్రవారం సాయంత్రం ప్రసారమైన ఒక కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ప్రజారాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ, మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనీ రఘురామకృష్ణం రాజు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అమరావతిని దేవతల రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడాన్ని అపహాస్యం చేస్తూ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధం, అవమానకరం అని పేర్కొన్నారు. ఇటువంటి అసహ్యకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను ప్రోత్సహించేలా ఆ కార్యక్రమానికి హోస్ట్ గా ఉన్న యాంకర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహరించారనీ రఘురామకృష్ణం రాజు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
శాసనసభ సభ్యునిగా, డిప్యూటీ స్పీకర్ గా ఈ ఇరువురిపై తక్షణం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాననీ రఘురామకృష్ణం రాజు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. వీరిరువురిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా డీజీపీని కోరారు. రాజధాని గౌరవం, మహిళల ఆత్మాభిమానం విషయంలో రాజీపడే ప్రశక్తే లేదన్న బలమైన సందేశాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందనీ, అందుకే వీరిరువురిపై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు ఆ లేఖలో డీజీపీని కోరారు.
http://www.teluguone.com/news/content/assembly-speaker-rrr-complaint-on-kommineni-and-drishnam-rajy-25-199515.html












