కోస్తాంధ్ర తీరంలో అలల కల్లోలం- ‘అసని’ తుపాను బీభత్సం
Publish Date:May 11, 2022
Advertisement
మచిలీపట్నానికి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన ‘అసని’ తీవ్ర తుపాను బలహీపడి తుపానుగా మారింది. అయితే.. కోస్తాంధ్ర తీరంలో అసని తుపాను తీవ్ర అలజడి రేపుతోంది. తీరాన్ని తాకక ముందే ఐదుసార్లు దిశ మార్చుకుని భయపెట్టింది. ప్రస్తుతం అసని తుపాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా కదులుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో పూర్తిగా భూభాగం మీదకు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను కారణంగా ఏపీలోని అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసని తుపాను అలజడి కారణంగా వాతావరణశాఖ అధికారులు ఉత్తరాంధ్రలో హై అలెర్ట్ ప్రకటించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేడు అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. కోనసీమ జిల్లాలోని అంతర్వేది, శంకరగుప్తం, ఓడరేవు తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం, గాలుల తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరిపంటకు భారీగా నష్టం వాటిల్లింది. అసని తుపాను తీవ్రత దృష్ట్యా నేడు ఏపీలో జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేశారు. తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వారు వెల్లడించారు. అసని తుపాను ఎఫెక్ట్ తో 37 రైళ్లను రద్దు చేశారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. తుపాను ఎఫెక్ట్ తో మచిలీపట్నం సమీపంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదారి, పశ్చిమ గోదారి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ప్రచండమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. తుపాను కారణంగా కాకినాడ, విశాఖ పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ చేశారు. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మత్స్యకారులు ఎవరూ మే 12 వరకు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని వాతావారణశాక హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రోడ్డు దెబ్బతిన్నాయి. అరటి, బొప్పాయి, వరి పంటలు బాగా దెబ్బతిన్నాయి. అసని తుపాను ప్రభావం తెలంగాణపైన కూడా పడింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు వాతావరణశాఖ ప్రాథమిక హెచ్చరిక జారీచేసింది. అసని తుపానుపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్షించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రెడీగా ఉంచారు. అసని తుపాను గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం లోపల కాకినాడ- విశాఖపట్నం మధ్యా తీరాన్ని దాటుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది.
http://www.teluguone.com/news/content/asani-cyclone-danger-bells-in-coastal-andhra-pradesh-25-135729.html





