తెరాసకు భూసంతర్పణ.. కాక రేపుతున్న జీవో 47.. గవర్నర్ రద్దు చేస్తారా?
Publish Date:May 24, 2022
Advertisement
తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని అనకూడదేమో కానీ, రాజ్ భవన్’తో రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు లేవనేది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం తీరు బాగాలేదని గవర్నర్ స్వయంగా ఆరోపించారు. మరో వంక ప్రభుత్వ వర్గాలు, అధికార పార్టీ నాయకులు. మంత్రులు గవర్నర్ బీజపీ నాయకురలిలాగా వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు, పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయడం విషయంలో, గవర్నర్, సర్కార్ మధ్య మొదలైన విబేధాలు, డైలీ సీరియల్ లా గత ఐదారు నెలలుగా అలా సాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు గవర్నర్’ ప్రోటోకాల్ విషయంలో ఉల్లంఘనకు పాల్పడింది. చివరకు, గణతంత్ర దినోత్సవం వేడుకల్లో కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలున్నాయి. అంతే కాదు, శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే, సమావేశాలు మొదలయ్యాయి. రాజ భవన్, ప్రగతి భవన్ (ముఖ్యమంత్రి కార్యాలయం) మధ్య వివాదం ఢిల్లీకి చేరింది. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్వయం ఢిల్లీ వెళ్లి , ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రిని అమిత్ షాను కలిసి విషయం వివరించారు. ప్రభుత్వ పని తీరు మీద ఫిర్యాదు చేశారు. అదే సందర్భంలో గవర్నర్ తమిళిసై కేసీఆర్ సర్కార్ తీరుపై బహిరంగంగా, మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తల్లి రాజ్ భవన్ లో చనిపోతే సీఎం చూసేందుకు కూడా రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, వివిధ సందర్బాలలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు తనను ఎలా బాధించింది వివరించారు. భావోద్రేకానికి గురయ్యారు, ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ, అలా చేయనని స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ధంగానే తమ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు, తెరాస ప్రభుత్వం తెరాస పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యాలయానికి, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కోట్ల రూపాయల విలువచేసే, 4935 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయిస్తూ జారీ చేసిన జీవో ఎం ఎస్ నెంబర్ 47 విషయంలో వివాదం రాజు కుంది. ఇప్పటికే, తెరాస రాష్ట్ర పార్టీ కార్యాలయానికి, అదే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 2004లోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1440 చదరపు గజాల స్థలాన్ని కేటాయించినందున, ఇప్పుడు జీవో ఎం ఎస్ నెంబర్ 47 ద్వారా చేసిన భూకేటాయింపును రద్దు చేయాలని కోరుతూ, అఖిల భారత షెడ్యూలు కులాలు /తెగల సమాఖ్య గవర్నర్’కు విజ్ఞాపన పత్రం సమర్పించింది. ఈ విజ్ఞాపన పత్రంలో సమాఖ్య ఇతర విషయాలతో పాటు. అసలు ఈ జీవోకు గవర్నర్ ఆమోదం ఉన్నదా,లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలనీ కోరింది. జీవోను. తెలంగాణ గవర్నర్ పేరున, గవర్నర్ ఆదేశాల మేరకు జారీ చేసినట్లు’ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ,సమాఖ్య సదరు భూమిని తెరాస పార్టీకి కేటాయిస్తూ గవర్నర్ లిఖిత పూర్వకంగా, లేదా ఇతరత్రా ఉతర్వులు ఇచ్చరా,అనే విషయాన్ని తెలియ చేయాలని కోరారు. ఈ భూమీ కేటాయింపు పై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి. పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించేందుకు స్థలం లేదని అంటున్నా ప్రభుత్వం, రూ.100 కోట్ల విలువచేసే భూమిని తెరాస పార్టీకి ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ భూ వివాదం గవర్నర్ కోర్టుకు చేరింది. ప్రభుత్వం జారీ చేసే జీవోలు అన్నీ సహజంగా, గవర్నర్ పేరునే జారీ అవుతాయి. అయితే, అన్ని జీవోలు గవర్నర్ దృష్టికి వస్తాయా, రావా అనేది స్పష్టం కావలసి ఉంది. అయితే, సాంకేతికంగా గవర్నర్ అనుమతి, ఆదేశాలతోనే జీవో జారీ అయినా తర్వాత కూడా సదరు జీవో వెనక్కు తీసుకునే అధికారం గవర్నర్ కు ఉంటుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పడు గవర్నర్ ఏమి చేస్తారు? ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది? ఈవివాదం చిలికి చిలికి గాలి వానగా మారుతుందా? రాజకీయ, రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా, అనేది చూడవలసి వుంది.
http://www.teluguone.com/news/content/araising-disputw-with-go-47-will-governer-cancil-25-136385.html





