రైతన్నలకు బాబు సర్కార్ తీపి కబురు.. ధ్యానం పాత బకాయిలకు మోక్షం
Publish Date:Jul 9, 2025
Advertisement
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నగదును 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిధులు రైతుల ఖాతాల్లో వేసే బాధ్యతను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కి ప్రభుత్వం అప్పగించింది. అందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజా పంపిణీ అవసరాల కోసం పౌరసరఫరాల సంస్థ ద్వారా గత రబీ సీజన్లో ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించింది. ఆ క్రమంలో మద్దతు ధరను రైతుల ఖాతాల్లో జమ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా రూ.1,000 కోట్లు రుణం తీసుకోవడానికి అనుమతిస్తూ జులై 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు వచ్చిన వెంటనే ధాన్యం బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో ఈ ధాన్యం బకాయిల సొమ్ము జమ కానుందని తెలుస్తుంది. ఇదే అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రైతులకు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.672కోట్లు విడుదలకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 32 వేల మంది రైతులకు ఈ నిధులు మంజూరు ద్వారా లబ్ది చేకూరుతోందన్నారు. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో పెండింగ్ బకాయిలు జమ చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/ap-government-pay-dues-to-farmers-39-201624.html





