ఏపీ బీజేపీ ఫిటింగులు మొదలెట్టిందండోయ్!
Publish Date:May 3, 2024
Advertisement
2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీని రకరకాలుగా చిత్రహింసలకు గురిచేసి, ఉక్కిరిబిక్కిరి చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత బీజేపీకి దక్కింది. పేరుకే మిత్రపక్షం అయినప్పటికీ, ఆగర్భశత్రువు కంటే ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తూ, తిరకాసులు పెడుతూ, నిధులు ఇవ్వకుండా వేధిస్తూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి శాయశక్తులా కృష్టి చేసిన పార్టీ బీజేపీ. ఆ పార్టీ తరఫున రాష్ట్రంలో ఆ ఘనకార్యాన్ని నిర్వర్తించిన ఇద్దరు మహానుభావుల్లో ఒకరు సోము వీర్రాజు మరొకరు జి.వి.ఎల్.నరసింహారావు. ప్రశాంతంగా వున్నదాన్ని సర్వనాశనం చేయడం... సర్వనాశనం అయిపోయినదాన్ని పట్టించుకోకుండా పక్కకి తప్పుకోవడం.. ఇదీ బీజేపీ లక్షణం.. ఈ లక్షణాన్నే ఈ ఇద్దరు నేతలూ ప్రదర్శించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలాంటిదో, బీజేపీ పరిస్థితి అంతకంటే తక్కువే. అయినా పొత్తు ధర్మాన్ని పాటించిన చంద్రబాబు బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు, మంత్రి పదవులు, ఎమ్మెల్సీ సీట్లు కట్టబెట్టినప్పటికీ, ఆ పార్టీ నాయకులు... ముఖ్యంగా ఈ ఇద్దరు నాయకులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోగా, బీజేపీ-టీడీపీ బంధం తెగిపోవడానికి తమవంతు కృషి చేశారు. తెలుగుదేశం అధికారంలో వున్నంతకాలం చీటికిమాటికి ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అనేక కామెంట్లు చేసిన బీజేపీ నాయకులు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి మట్టి తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని జగన్ ప్రభుత్వం మట్టిలో కలిపేస్తుంటే వీళ్ళెవరూ కిక్కురుమనలేదు. జగన్ అరాచకాల మీద ఏనాడూ స్పందించిన దాఖలాలు, పోరాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు మరోసారి టీడీపీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో మళ్ళీ ఈ నాయకులు తెరమీదకి వచ్చారు. అప్పట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ విశ్వరూపం చూపించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలోనే వాళ్ళ నిజస్వరూపం చూపించడం ప్రారంభించారు. ఏపీ బీజేపీలో సుందోపసుందులుగా అభివర్ణించే సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహరావుల్లో ఒకరైన జీవీఎల్ రంగంలోకి దిగారు. తన కామెంట్లతో ప్రశాంతంగా వున్న వాతావరణాన్ని నాశనం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. అసలు బీజేపీకి సంబంధం ఉందని ఎవరు చెప్పారట ఈయన సంబంధం లేదని స్టేట్మెంట్ ఇవ్వడానికి? బీజేపీకి సంబంధం లేదు కాబట్టే... టీడీపీ, జనసేనల పేరిట మేనిఫెస్టో విడుదలైంది. మీ పార్టీ అసలే సీన్లోనే లేనప్పుడు మీరెందుకు గిల్లి గొడవపెట్టుకోవాలని అనుకుంటున్నారో అర్థం కాని విషయం. రేపటి రోజున మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే జనం ప్రశ్నించేది చంద్రబాబునో, పవన్ కళ్యాణ్నో తప్ప జనం ఎంతమాత్రం పట్టించుకోని జీవీఎల్ని కాదు.. కేంద్రంలో ఉంటాడో ఉండడో తెలియని మోడీని కాదు. ఒకవేళ మోడీ కేంద్రంలో వున్నా ఆయన్ని అడగరు.. ఎందుకంటే, ఆ మేనిఫెస్టోకి బీజేపీకి సంబంధం లేదు కాబట్టి. సంబంధం లేకుండా బీజేపీయే చాకచక్యంగా తప్పించుకుంది కాబట్టి. ఇక, జీవీఎల్ నరసింహారావు ఉపయోగించిన మరో అద్భుతమైన కామెంట్, అసహనం వ్యక్తం చేసిన అంశం ఏమిటంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ని ఏపీలో కూటమి సరిగా వాడుకోవడం లేదట. అసలు మోడీకి ఇమేజ్ ఎక్కడుందయ్యా వాడుకోవడానికి? మోడీ ఇమేజ్ దేశవ్యాప్తంగా సన్నగిల్లుతున్న విషయం మీకు అర్థం కావడం లేదా? ఇప్పటి వరకు జరిగిన అన్ని విడతల పోలింగ్లోనూ బీజేపీకి షాక్ తగిలింది. మరి మోడీ ఇమేజ్ వుంటే ఆ షాకులు ఎందుకు తగులుతాయి. కర్నాటకలో ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూ తర్వాత ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీకి కూడా ఆ మకిలి అంటుకుంది. అది కడుక్కోండి ముందు. ఇక మోడీ ఇమేజ్ విషయం గురించి ఇంకా చెప్పాలంటే, దేశంలో ఎక్కడైనా మోడీ ఇమేజ్ ఉందో లేదోగానీ, ఏపీలో మాత్రం మోడీకి ఏమాత్రం ఇమేజ్ లేదు.. అసలు నిజం చెప్పాలంటే, ఏపీని నాశనం చేసిందే నరేంద్ర మోడీ.. అలా ఆయన నాశనం చేయడానికి ఆయనకు సంపూర్ణ సహకారం అందించింది జీవీఎల్, సోమూ వీర్రాజు లాంటి జనాదరణ లేని నాయకులు. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా 18 శాతం ఓట్లు వస్తాయని జీవీఎల్ నరసింహారావు జోకు వేశారు. ఇంతకు మించిన ఓవర్ కాన్ఫిడెన్స్ దేశ రాజకీయల్లోనే వుండదు. ఏపీలో మీకు బలుపు లేదు.. వాపులేదు.. ఏపీలో బీజేపీ ఒక అస్థిపంజరం మాత్రమే. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ఏపీని నాశనం చేసిందే బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి అస్థిపంజరం లాంటి, ఏపీ ప్రజలను మోసం చేసిన బీజేపీతో చంద్రబాబు, జనసేన పొత్తు పెట్టుకుంది మీ పార్టీ ఏదో ఊడబొడుస్తుందని కాదు... గత ఎన్నికల సందర్భంగా చేసిన కుట్రలు, కుతంత్రాలు చేయకుండా వుంటుందనే. అయినా సరే, మీ బుద్ధి, మీ పార్టీ బుద్ధి మారదుగా.. ఎన్నికల సమయంలోనే కుట్రలు ప్రారంభించారు. పేరుకే మీ పార్టీ కూటమిలో వుంది.. మీ పార్టీ గానీ, మీరుగానీ ఏనాడైనా పొత్తు ధర్మాన్ని పాటించారా? జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడితే, మోడీ అర్జెంటుగా స్పందించేసి అయ్యయ్యో అని ట్వీట్ చేశారు. టీడీపీ, జనసేన గులకరాయి ఉదంతం అంతా డ్రామా అని విమర్శిస్తుంటే మీ పార్టీ ఏనాడైనా నోరు మెదిపిందా? ప్రస్తుతం ఏపీ బీజేపీ తనువు కూటమిలో వుంది.. మనసు మాత్రం జగన్తోనే వుంది. ఏపీ బీజేపీ ఇప్పుడు రాజకీయ మానసిక వ్యభిచారం చేస్తోంది. కూటమి విజయం సాధిస్తే బీజేపీ నాయకులు మావల్లే కూటమి విజయం సాధించిందని బిల్డప్పు ఇస్తారు. జనం ఖర్మకాలి వైసీపీ విజయం సాధిస్తే చడీ చప్పుడు లేకుండా వైసీపీ వైపు వెళ్ళిపోతారు. బీజేపీ నాటకాలు, బీజేపీ నాయకుల చాతుర్యాలు చంద్రబాబుకు తెలియక కాదు.. జగన్ పాలనలో సర్వనాశనం అయిపోయిన ఏపీకి పునర్ వైభవం తేవడానికే బీజేపీతో కలసి నడుస్తున్నారు.. జీవీఎల్ లాంటి నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నా భరిస్తున్నారు. బీజేపీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, వైసీపీ లాంటి శత్రువునైనా ఎదుర్కోవచ్చుగానీ, బీజేపీ లాంటి మిత్రుణ్ణి భరించలేం.
http://www.teluguone.com/news/content/ap-bjp-leaders-double-standerds-25-175036.html