అసెంబ్లీ బహిష్కరణ కొనసాగింపునకే వైసీపీఎల్పీ సమావేశం నిర్ణయం.!
Publish Date:Aug 12, 2026
Advertisement
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ శాసనసభాపక్షం బుధవారం (ఆగస్టు 12)న భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సాధారణంగా ఏ పార్టీ అయినా శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేస్తుంది. దీంతో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం అనగానే.. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణకు స్వస్తి చెప్పి సభకు హాజరు కానుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. అయితే వైసీపీ శాసనసభాపక్ష సమావేశం మాత్రం అసెంబ్లీ బహిష్కరణను కొనసాగించాలన్న నిర్ణయం తీసుకుంది. ఇప్పుడూ ప్రతిపక్ష హోదాపై స్పష్టత రానందున సభను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. 2024 శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ సంఖ్య సభ్యులతో సభలో ప్రతిపక్ష హోదా వచ్చే అవకావం ఇసుమంతైనా లేదు. అయితే వైసీపీ మాత్రం నిబంధనలతో పని లేకుండా తమ పార్టీకి ప్రతిపక్ష హోదా, పార్టీ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఆ డిమాండ్ తో నే అసెంబ్లీ బహిష్కరణ చేస్తున్నది. శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది. ముఖ్యంగా మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలపై ప్రభుత్వాన్ని మండలిలో నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ శాసనమండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు. AP Assembly, Monsoon Sessions, YSRCP Boycott, Jagan Leader of Opposition Status, AP Legislative Council, TeluguOne
http://www.teluguone.com/news/content/ap-assembly-39-228763.html





