అన్యాయం జరిగితే మరో తెలంగాణ ఉద్యమం.. కేంద్రానికి కవిత హెచ్చరిక
Publish Date:Apr 16, 2026
Advertisement
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. పార్లమెంటులో తెలంగాణ ప్రాతినిధ్యాన్ని తగ్గించేలా లేదా రాష్ట్ర గొంతు నొక్కేలా కేంద్రం అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. నియోజకవర్గాలను బ్లాంకెట్గా 50 శాతం పెంచుతామని చెప్పడం పై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చూడటానికి ఇది సరైన నిర్ణయంలా కనిపించినా తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకూ నష్టం జరుగుతుందన్నారు. బీహార్ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు తక్కువ సీట్లు వస్తాయనీ, దీంతో రాష్ట్ర రాజకీయ ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉందని కవిత అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో తెలంగాణకు 3.13 శాతం ప్రాతినిధ్యం ఉందని గుర్తుచేస్తూ, డిలిమిటేషన్ తర్వాత కూడా అదే శాతం కొనసాగాలని ఆమె డిమాండ్ చేశారు. “అలా కాకపోతే మరో తెలంగాణ ఉద్యమం తప్పదు” అని హెచ్చరించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును కవిత దుయ్యబట్టారు. పునర్విభజన తర్వాత దేశవ్యాప్తంగా సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ, ప్రస్తుత నిష్పత్తిని బేస్లైన్గా తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. జనాభా నియంత్రణ పాటించి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టగా కవిత అభివర్ణించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని, ఇది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందన్నారు.
http://www.teluguone.com/news/content/another-telangana-movement-if-injustice-occurs-39-217492.html





