ఫోన్ ట్యాపింగ్ మెగా సీరియల్లో మరో ట్విస్ట్!
Publish Date:Jun 21, 2025

Advertisement
తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త కథలు, కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు తొంగి చూస్తున్నాయి. ఈ వ్యవహారం పై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని అప్పట్లో ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పిలిచి మనీ వాగ్మూలాలు నమోదు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పీసీసీ అధ్యక్షడు మహేష్ కుమార్ గౌడ్ సహా అనేక మంది నాయకులను, నాయకుల అనుచరులను, ఇతరులను విచారించింది. వాంగ్మూలాలు నమోదు చేసింది.
ఇప్పుడు తాజాగా, గతంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు ఫిర్యాదు చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను వాగ్మూలం ఇవ్వాలని సిట్ కోరింది. రెండు మూడు రోజుల్లో సిట్ ఎదుట హాజరై వాగ్మూలం ఇచ్చేందుకు బండి సంజయ్ కుమార్ అంగీకరించారు. బండి సంజయ్ తో పాటుగా ఆయన సన్నిహిత సహచరుడు, కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గం బీజేపీ కన్వీనర్ ప్రవీణ్ రావుకు కూడా సిట్ స్వాగతం పలికింది.
నిజానికి.. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ క్రైమ్. అందులో సందేహం లేదు. అలాంటిది ఒకే రోజున అది కూడా, 2023 ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ రోజున మావోయిస్టులుగా ముద్ర వేసి మరీ 600 మంది ఫోన్లను ట్యాపింగ్ జరిగిందే నిజం అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పెద్ద నేరానికి పాల్పడిందని, అందుకు గట్టి మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని అంటున్నారు. అయితే.. ఈ కేసులో ముడి పడిన చిక్కు ముళ్ళు అన్నీ తొలిగి, కేసు విచారణ పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుందో.. అసలు కేసు ఏనాటికి అయినా ఒక కొలిక్కి వస్తుందో రాదో చెప్పలేమనీ.. చెప్పాలను కోవడం సాహసమే అవుతుందనీ పదవీ విరమణ చేసిన సీనియర్ అధికారులు, న్యాయనిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
మరోవంక కేసు విచారణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద నేరం. అధికార, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సినిమా స్టార్లు, సెలబ్రిటీలు చివరకు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే.. (చేసిందే నిజమైతే) నిజంగా అది మహా పెద్ద నేరం. అయితే.. కేసు విచారణ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లు తోచడం లేదని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతే కాదు,స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఫోన్ ట్యాపింగ్ మెగా సీరియల్ రన్ చేస్తున్నారని కిషన్ రెడ్డి అంటున్నారు.
అదలా ఉంటే.. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ప్రధాన సూత్రం దారులు, పాత్ర దారులు, నేరాన్ని అవతలి వారిపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇంతవరకు మూడు నాలుగు పర్యాయాలు సిట్ ఎదుట విచారణకు హాజరైన ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర రావు తాజా విచారణలో కొత్త పల్లవి ఎత్తుకున్నట్లు సమాచారం.ఇంతవరకు ఆకుకు అందకుండా పోకకు చిక్కకుండా.. పొంతనలేని సమాధానాలు ఇచ్చిన ప్రభాకర రావు, ఇప్పడు తాజాగా అంతా ఆయనే చేశారు, ఆయన చెప్పిందే నేను చేశాను, ఆయన చెప్పిన ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేశాను అంటూ మొత్తం నేరాన్ని అప్పటి డీజీపీ పైకి నెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అప్పటి రాజకీయ ముఖ్యులు ఎవరూ తనకు ప్రత్యక్షంగా ఆదేశాలు, సూచనలు ఇవ్వలేదని కూడా ప్రభాకర రావు సిట్ కు చెప్పినట్లు సమాచారం.
కాగా ఈకేసులో ఇప్పటికే సిట్ కు వాగ్మూలం ఇచ్చిన ఇతర నిందితులు ప్రణీత్ రావు, భుజంగ రావు, రాధాకృష్ణ రావు, తిరుపతన్న ప్రభాకరరావు చెప్పినట్లే తాము పని చేశామని తమ తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇప్పడు అదే ప్రభాకర రావు డీజీపీ వైపు వేలు చూపిస్తున్నారు,. రేపు డీజీపీ ఎవరి వైపు వేలు చూపుతారు ..ఏమి జరుగుతుంది .. చూడాల్సింది చాలానే వుంది . చూస్తూనే ఉందాం.
http://www.teluguone.com/news/content/another-ewist-in-phone-tapping-case-39-200423.html












