పాకిస్థాన్లో పురాతన గురుద్వారా ధ్వంసం.. ఇండియా సీరియస్!
Publish Date:Jul 2, 2026
Advertisement
పాకిస్థాన్లో మైనారిటీలకు రక్షణ, మతపరమైన కట్టడాలకు భద్రత కరవైంది. పాకిస్థాన్ లో హిందువులు, సిక్కుల ప్రార్థనా స్థలాలపై తరచూ జరుగుతున్న దాడులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ లో నూట పాతిక సంవత్సరాల నాటి పురాతన గురుద్వారాను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో శతాబ్ద కాలానికి పైగా ఎంతో పవిత్రంగా, చారిత్రక వారసత్వంగా విరాజిల్లుతున్న గురుద్వారాను కొందరు దుండగులు పాక్షికంగా కూల్చివేసి ధ్వంసం చేయడంపై సిక్కు సమాజమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇండియా కూడా తీవ్రంగా స్పందించి పాకిస్థాన్ తీరును గర్హించింది. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోని ఫరూఖాబాద్ ప్రాంతంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ సాహిబ్ 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన కట్టడం. ఈ కట్టడం సిక్కుల సంస్కృతికి, వారి అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. అయితే, గత నెల 24న గుర్తుతెలియని దుండగులు ఈ గురుద్వారాపై దాడి చేసి.. ప్రధాన గుమ్మటంతో పాటు, కట్టడంలోని కొన్ని ముఖ్యమైన భాగాలను కూల్చివేశారు. ఈ విధ్వంసం జరుగుతున్నప్పుడు స్థానిక అధికారులు, రక్షక భట నిలయ సిబ్బంది కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ చారిత్రక కట్టడంపై జరిగిన దాడిని నివారించడంలోనూ, మైనారిటీల ఆస్తులను కాపాడటంలోను స్థానిక పాకిస్థాన్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని అక్కడి సిక్కు సంఘాలుఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సహా దేశంలోని పలు ప్రతిష్టాత్మక సిక్కు సంస్థలు ఈ దారుణాన్ని ముక్తకంఠంతో ఖండించాయి. పాకిస్థాన్ భూభాగంలో నివసిస్తున్న మైనారిటీల ప్రాణాలకు, వారి పవిత్ర ప్రార్థనా స్థలాలకు ఏమాత్రం రక్షణ కల్పించలేకపోతున్నారని, అక్కడి ప్రభుత్వం తక్షణమే మేల్కొని తగిన రక్షణ చర్యలు చేపట్టాలని భారతీయ సిక్కు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. గురుద్వారా ధ్వంసం ఘటనను భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ఈ అనాగరిక ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణమే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని, ఈ ఘోరానికి ఒడిగట్టిన దోషులను గుర్తించి వారిని శిక్షించాలనీ డిమాండ్ చేసింది. పాకిస్థాన్లో మైనారిటీలు, వారి ప్రార్థనా స్థలాలు లక్ష్యంగా నిరంతరం సాగుతున్న దాడులను అరికట్టడంలో పాక్ విఫలమవుతోందని, ఇటువంటి దుశ్చర్యలకు ఇకనైనా స్వస్తి పలకాలని హెచ్చరించింది.
http://www.teluguone.com/news/content/ancient-gurudwara-demolished-in-pakistan-36-224817.html





