యాక్సిడెంట్ చేసి.. కారు బానెట్ పై రెండు కిలో మీటర్లు ఈడ్చుకెళ్లాడు!
Publish Date:May 2, 2026
Advertisement
యాక్సిడెంట్ చేసి, ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఓ కారు డ్రైవర్ దాదాపు రెండు కిలోమీటర్ల దూరం బానెట్పై ఈడ్చుకెళ్లాడు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ మీర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్తో కలిసి బైక్పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు. అయినా డ్రైవర్ ఆపకుండా, బానెట్పై ఉన్న జిలానీ సహా కారును బాలాపూర్ చౌరస్తా మీదుగా మంద మల్లమ్మ చౌరస్తా వరకు సుమారు 2 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు కారును అడ్డుకోవడంతో డ్రైవర్ బాధితుడిని వదిలి పరారయ్యాడు. ఆ కారుకు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే స్టిక్కర్ ఉన్నట్లు బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఫైసల్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు జిలానీ ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/after-causing-an-accident-driver-dragged-victim-on-car-36-218841.html





