విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Publish Date:Apr 27, 2026
Advertisement
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. పూసపాటిరేగ మండలం పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం (ఏప్రిల్ 27) అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు పేరాపురం జంక్షన్ వద్ద అదుపుతప్పి రహదారి పక్కన టీ తాగి రోడ్డుపైకి వస్తున్న ఇద్దరు పాదచారులను బలంగా ఢీకొట్టింది. అనంతరం నియంత్రణ కోల్పోయి సమీపంలో పార్క్ చేసి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్, కారులోని మరో ప్రయాణికుడు, ఇద్దరు పాదచారులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. మృతుల్లో ఒకరిని విశాఖపట్నానికి చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ శ్రీనివాస్గా గుర్తించారు. గాయపడిన వ్యక్తి బొబ్బిలికి చెందినవారని, అతడిని చికిత్స కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/accident-in-vijayanagaram-district-36-218417.html





