పందెం కోడి @ 500 కోట్లు.. తగ్గేదే లే.. మజారే మజా..
Publish Date:Jan 17, 2022
Advertisement
పందెం కోడి పవర్ మామూలుగా లేదుగా. ఈసారి కరోనా దెబ్బకు కోడి దెబ్బైపోతుందని అనుకున్నారు కొందరు. కానీ, పందెం కోడి ఎక్కడా తగ్గలా. కాలికి కత్తి కట్టి.. వేలు, లక్షల్లో బెట్టింగ్ పెట్టి.. బరిలో కాసుల వర్షం కురిపించింది. గుండాల, పేకాల కూడా అదే రేంజ్లో కుమ్మేసింది. ఎప్పటిలానే తెలుగురాష్ట్రాలతో పాటు విదేశీయులూ, ఇతర స్టేట్స్ వాళ్లూ గోదావరి జిల్లాల్లో సందడి చేశారు. మూడు రోజులు.. కోడి కూత ఆగిందే లే. బరిలో రక్తం చిమ్మడం ఆగిందే లే. బరుల ప్రాంతంలో తిరునాళ్లే. దాదాపు అన్నిబరులు వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. ఎప్పటిలానే ఖాకీలు అటువైపు కన్నెత్తి చూడనేలే. ఏపీ వ్యాప్తంగా 500 కోట్ల మేర పందేలు జరిగినట్టు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే 300 కోట్లకుపైగా బెట్టింగ్ నడిచింది. ఇక, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ జోరు పెరిగింది. గుడివాడలో కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్లో చిన్నపాటి గోవానే దించేశారు. పేకాట, చీర్ గాల్స్తో పాటు క్యాషినో సైతం ఏర్పాటు చేశారు. ఆ డెన్లోనే వందల కోట్లు చేతులు మారాయని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా పందేలతోపాటు రికార్డింగ్ డాన్సులు కూడా జోరుగా, హుషారుగా సాగాయి. కోనసీమలో 50కి పైగా పెద్ద బరులతో పాటు వందల సంఖ్యలో డిక్కీ పందేలు జరిగాయి. ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులకు మామూళ్లు చెల్లించడంతో వారు అటువైపే చూడలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు-దొంతికుర్రు మెగా బరి దగ్గర మూడ్రోజుల్లో రూ.10-12 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని చెబుతున్నారు. తన బంధువులకు అవమానం జరిగిదంటూ టీడీపీకి చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మి కంగా నిష్క్రమించారు. పల్లంకుర్రు బరి వందలాది కార్లు, వేల సంఖ్యలో మోటారు సైకిళ్లతో తిరునాళ్లను తలపించింది. వీఐపీల కోసం కార్వాన్ వాహనాలను సైతం సిద్ధం చేశారు. విందు భోజనాలు సరే సరి. కృష్ణా జిల్లా ముసునూరు మండలం లోపూడిలో ఏర్పాటుచేసిన భారీ బరిలో.. ఏకంగా ఏటీఎం ఏర్పాటు చేశారు. కృష్ణా సహకార బ్యాంకు మొబైల్ ఏటీఎంను ఏర్పాటు చేసి పందెంరాయుళ్లకు నగదు అందుబాటులో ఉంచింది. ఆలపాడు దగ్గర ఐదు పందేల్లో ఎక్కువ సార్లు ఎవరు గెలిస్తే వారికి రూ.10 లక్షలు విలువైన స్విఫ్ట్ కారు ఇచ్చేందుకు అంగీకారంతో రంగంలోకి దిగారు. ఒకరు ఐదింట్లో వరుసగా నాలుగు పందేల్లో గెలిచి కారు అందుకున్నారు. మలికిపురంలో పోలీస్స్టేషన్ పక్కనే పందేలు, గుండాటలను నిర్వహించారు. కొత్తపేట ప్రభల తీర్థంలో అశ్లీల డ్యాన్సులు నడిచాయి. పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో వైసీపీ యువనేత పుట్టినరోజు సందర్భంగా భారీస్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి కోనసీమకు వేలాది మంది తరలి రాగా అమెరికా, యూఏఈ దేశాల నుంచి కూడా వచ్చారు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద పందుల పోటీలు ఆసక్తికరంగా జరిగాయి.
http://www.teluguone.com/news/content/500-crore-betting-over-cock-fights-39-130264.html