ఆశలను చిదిమేసిన విమాన ప్రమాదం.. మాటలకందని విషాదం
Publish Date:Jun 13, 2025

Advertisement
విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాజస్థాన్ కు చెందిన ప్రతీక్ జోషి గత ఆరేళ్లుగా లండన్ లోనే పని చేస్తున్నారు. ఆయన కల కుటుంబం మొత్తాన్ని లండన్ కు తీసుకువెళ్లి అక్కడే స్థిరపడాలని. ఎట్టకేలకు ఆ కల నెరవేరే రోజు వచ్చిందని సంబరపడ్డారు. భార్యా, ముగ్గురు పిల్లలను తీసుకుని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరారు. విమానం టేకాఫ్ కు ముందు కుటుంబంతో సెల్ఫీ దిగి బంధుమిత్రులకు గుడ్ బై చెబుతూ షేర్ చేశారు. అయితే అదే చివరి ప్రయాణమనీ, తిరిగి రాని లోకాలకు వెడుతున్నామనీ ఆ క్షణంలో వారికి తెలియదు.
లండన్ ప్రయాణం ఖరారు కావడంతో ప్రతీక్ జోషి భార్య కోమి వ్యాస్ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ లు సహా కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మరణించారు. గత ఆరేళ్లుగా లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రతీక్ జోషి.. ఈ ఆరేళ్లూ భార్యాబిడ్డలను లండన్ తీసుకువెళ్లి అక్కడ స్థిరపడాలన్న లక్ష్యంతోనే ఉన్నారు. ఆ లక్ష్య సాధన కోసం శ్రమించారు. చివరకు అన్నీ అనుకున్నట్లుగా జరుగుతున్నాయని అనుకుంటున్న సమయంలో.. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా.. ఘోర విమాన ప్రమాదంలో కుటుంబం మొత్తం మరణించింది.
ఇలా ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాధ. అందులో రాజస్థాన్ కు చెందిన ఖుష్బూ గాధ ఒకటి. ఆమెకు ఇటీవలే వివాహం అయ్యింది. ఆమె భర్త లండన్ లో విద్య అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన భర్తను కలిసేందుకు ఆమె లండన్ బయలుదేరారు. అయితే ఆమె లండన్ చేరలేదు. ఆహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
అలాగే భారత పర్యటనకు వచ్చిన ఇద్దరు బ్రిటిషర్లది మరో విషాదం. భారత్ సంస్కృతి పట్ల అభిమానంతో.. భారత్ లో పర్యాటక ప్రదేశాలను చూసి ఆ అనుభవాలను జీవితాంతం పదిలంగా దాచుకోవాలన్న ఆశలో ఇద్దరు బ్రిటిషర్ లు భారత పర్యటనకు వచ్చి... బ్రిటన్ కు తిరుగు ప్రయాణమయ్యారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇద్దరూ అసువులు బాసారు. బుధవారం (జూన్ 11) వీరు ఇన్ స్టా గ్రాంలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. భారత్ లో ఇది మాకు చివరి రాత్రి అంటూ మొదలు పెట్టి.. భారత్ పర్యటన మాకు ఎన్నో మరపురాని అనుభూతులను మిగిల్చింది. ఈ పర్యటనతో భారత్ పట్ల మా అభిమానం, ఇష్టం ఎన్నో రెట్లు పెరిగింది. కొన్ని గంటల్లో ఈ దేశం విడిచి వెడుతున్నాం. అందుకు చాలా బాధగా ఉంటోంది అంటూ సాగిన వారి ఇన్ స్టా గ్రాం పోస్టు కంటతడి పెట్టిస్తోంది. భారత్ పై అంతటి అభిమానాన్ని పెంచుకున్న వారు ఇలా విమన ప్రమాదంలో మరణించడం బాధేస్తోందంటూ నెటిజనులు కామెంట్లు పెడతున్నారు.
http://www.teluguone.com/news/content/-plane-crasht-shattered-hopes-39-199821.html












