విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, లోకేష్
Publish Date:Jul 24, 2026
Advertisement
పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో మమేకమైన సీఎం... భోజనం నాణ్యతపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో విటమిన్ లోపాలను నివారించేలా పోషకాహారం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్... ప్రభుత్వం ఇప్పటికే పోషకాహారాన్ని అందించే చర్యలు చేపట్టిందని, విద్యార్థులకు కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు స్నాక్స్గా ఏమి అందిస్తున్నారని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకోగా... ప్రస్తుతం మధ్యాహ్న భోజనంతో పాటు చిక్కీ, ఉదయం రాగి మాల్ట్ అందిస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు. విద్యార్థులు ఇంటికి వెళ్లే ముందు కూడా పోషకాహారంగా చిక్కీ అందించే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.అనంతరం తమతో ఫొటోలు దిగాలని కోరిన విద్యార్థుల అభ్యర్థనను సీఎం చంద్రబాబు సంతోషంగా స్వీకరించారు. వారితో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ ఆప్యాయంగా ముచ్చటించారు.
http://www.teluguone.com/news/content/-parent-teacher-meeting-36-227001.html





