మెగా డీఎస్సీపై వైసీపీ పోరుకు కోర్టు తీర్పు ఎండ్ కార్డ్.!
Publish Date:Aug 5, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ విషయంలో వైసీపీ చేస్తున్న పోరాటానికి ఎండ్ కార్డ్ పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయనీ, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలనీ కోరుతూ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిల్ ను విచారించిన హైకోర్టు.. మెగా డీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారం లేదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మెగాడీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగితే.. బాధిత అభ్యర్థులు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఎలాంటి ఆధారాలు పిటిషన్ దాఖలు చేయడం సహేతుకం కాదని పేర్కొంటూ.. రాజకీయ ప్రయోజనాలు, లబ్ధి కోసం ఇటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేస్తే, పిల్ అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని ధర్మాసనం పేర్కొంది. రాజకీయాలకు కోర్టులను వేదికలుగా చేసుకోవడాన్ని ఉపేక్సించమని పేర్కొంటూ.. మెగా డీఎస్సీపై సిబిఐ విచారణ కోరుతూ పర్వత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది. కోర్టు విస్పష్ట తీర్పుతో మెగా డీఎస్సీలో అక్రమాలు, నియమక ప్రక్రియలో అవకతవకలు అంటే వైసీపీ చేస్తున్న వాదనలో సరుకులేదని తేలిపోయింది. ఇక హైకోర్టు తీర్పుతో డీఎస్సీ నియామక ప్రక్రియ నిరాటంకంగా వేగంగాసాగనుంది. కోర్టు వివాదాల కారణంతో నియామకాలు ఆలస్యమవుతాయేమోనని ఆందోళన చెందిన నిరుద్యోగ యువత కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. AP Mega DSC, AP High Court, YSRCP PIL Dismissed, Nara Lokesh, AP Teacher Recruitment 2026
http://www.teluguone.com/news/content/-ap-mega-dsc-36-228051.html





