ఓవల్‌లో టీమ్ ఇండియా 2021 ఫీట్ రిపీట్ చేస్తుందా?

భారత్-ఇంగ్లండ్ మధ్య కీలకమైన చివరి, ఐదో టెస్ట్‌ లండన్ కెన్నింగ్టన్ ఓవల్‌ వేదికగా  ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పుడు ఇంగ్లండ్ 2-1తో ముందంజలో ఉన్నప్పటికీ, కెన్నింగ్టన్ వేదికలో ఇప్పటికే టీమ్ ఇండియా ఓ అరుదైన రికార్డ్ సాధించింది. ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా 143 ఓవర్లు బ్యాటింగ్ చేసి డ్రా చేయడంతో నాలుగో టెస్టుతోనూ  సిరీస్‌ ఇంగ్లాండ్ వశం కాకుండా అడ్డుకుంది. ఇది క్రికెట్‌లో చరిత్రలో అరుదైన సాహసమని క్రీడా వర్గాలు అంటున్నాయి.

కెన్నింగ్టన్ ఓవల్‌లో భారత్ గత రికార్డు ఒకింత మెరుగుగా ఉంది.  ఇంగ్లండ్‌లోని ఇతర మైదానాలతో పోలిస్తే ఇక్కడ కాస్తో కూస్తో ఇండియాకు మెరుగైన ట్రాక్‌ రికార్డ్ ఉంది . 1936 నుంచి ఇప్పటివరకు ఈ వేదికపై భారత్ 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా, రెండు సార్లు విజయం సాధించింది, ఆరు సార్లు ఓడిపోయింది, ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్ తొలి విజయం 1971లో సాధించగా, రెండో విజయం 2021లో వచ్చింది. ఈ మైదానంలో భారత్ మూడు సార్లు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది.

భారత్ చివరిసారిగా ఓవల్‌లో ఇంగ్లండ్‌తో 2021 సెప్టెంబర్‌లో తలపడింది. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 191 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీ అర్ధ సెంచరీ (50) సాధించినప్పటికీ, జట్టు 127/7 వద్ద కష్టాల్లో పడింది. అయితే, శార్దూల్ ఠాకూర్ 36 బంతుల్లో 57 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 62/5 వద్ద కష్టాల్లో పడినప్పటికీ, ఓలీ పోప్ (81), క్రిస్ వోక్స్ (50), జానీ బెయిర్‌స్టో, మోయిన్ అలీల సహకారంతో 290 పరుగులు చేసి 99 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. రోహిత్ శర్మ  విదేశాలలో తొలి  టెస్ట్ సెంచరీ (127)తో అదరగొట్టాడు. పుజారా, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్‌లు అర్ధ సెంచరీలతో రాణించారు.  కేఎల్ రాహుల్ (46), కోహ్లీ (44) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో భారత్ 466 పరుగుల భారీ స్కోరు సాధించి, ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ 100 పరుగుల భాగస్వామ్యంతో బాగా ఆరంభించినప్పటికీ, భారత బౌలర్ల దాడిలో 210 పరుగులకే కుప్పకూలి పరాజయాన్ని మూట గట్టుకుంది. 

2021లో ఓవల్‌లో సాధించిన విజయం భారత్‌కు స్ఫూర్తినిస్తుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో జట్టు సిరీస్‌ను 2-2తో సమం చేయాలని ఆశిస్తోంది. ఓవల్‌లో భారత్‌కు రెండో టెస్ట్ విజయం 2021లో వచ్చినప్పటికీ, ఈ మైదానం ఎల్లప్పుడూ గట్టి పోటీని ఇస్తోంది. రోహిత్, గిల్, పుజారా వంటి ఆటగాళ్లతో అప్పుడు చూపించిన అద్భుత ప్రదర్శన ఈసారి కూడా భారత్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు జట్లూ కూడా విజయం కోసం తీవ్రంగా పోరాడనున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu