ఆయుర్వేద ఆనందయ్య ఎక్కడ? ప్రభుత్వమే కిడ్నాప్ చేసిందా?

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కృష్ణపట్నం ఆయుర్వేద ఆనందయ్య అచూకి ఇంకా తెలియడం లేదు. ఆయన ఎక్కడున్నాడో అతని కుటుంబ సభ్యులు కూడా చెప్పలేకపోతున్నారు. వారం రోజుల పాటు పోలీసుల నిర్భందంలో ఉన్న ఆనందయ్య శుక్రవారం రాత్రి కృష్ణపట్నంలోని తన ఇంటికి వచ్చారు. తర్వాత కొన్ని గంటల్లోనే శనివారం తెల్లవారుజామున ఆనందయ్య కనిపించకుండా పోయారు. ఆనందయ్యను పోలీసులే తీసుకెళ్లి  ర‌హ‌స్య ప్రాంతంలో ఉంచారని తెలుస్తోంది. ఆనందయ్యకు భద్రత కల్పించేందుకు తీసుకెళ్లామన్నది పోలీసుల వర్గాల వాదన. అయితే ఆయనను ఎక్కడ ఉంచారన్నది మాత్రం  చెప్పడం లేదు. 

ఆనందయ్య ఆచూకి చెప్పడం లేదంటూ కృష్ణపట్నం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే కిడ్నాప్ చేసిందని మండిపడుతున్నారు. మరోవైపు 
కృష్ణ ప‌ట్నంలో 144 సెక్ష‌న్ కొన‌సాగుతోంది. ముత్తుకూరు నుంచి వ‌చ్చే స్థానికేత‌రుల‌కు అనుమ‌తి నిరాక‌రిస్తున్నారు. కృష్ణ‌ప‌ట్నం, గోపాల‌పురంలో ప్ర‌త్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇత‌ర ప్రాంతాల నుంచి కృష్ణ‌ప‌ట్నానికి అంబులెన్సుల్లో రోగులు వ‌స్తున్నారు. వారిని పోలీసులు వెన‌క్కి పంపుతున్నారు. ఆనంద‌య్య ఔష‌ధంపై సోమవారం తుది నివేదిక రానుందని, ఆ తర్వాతే మందు పంపిణిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. 

కృష్ణపట్నం ఆనందయ్యకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాశారు. మీరు ఇచ్చే మందుతో మీ ఖ్యాతి జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. రాజకీయాలకు అతీతంగా అందరూ మీకు అండగా నిలుస్తున్నారు. ప్రజలందరూ దేవుడిగా భావిస్తున్న మిమ్మల్ని భద్రత పేరుతో నిర్బంధించడంపై చాలా బాధపడుతున్నాం అంటూ సోమిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. జైలులో ఖైదీకి ఉండే స్వేచ్ఛ కూడా మీకు లేకుండా చేయడం బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీకు భద్రత కల్పించకపోయినా కృష్ణపట్నం ఊరుఊరంతా అండగా ఉంది.. వాళ్లే మీకు రక్షణ కల్పిస్తారు… మీపై కొందరు పెడుతున్న ఒత్తిడిని చూస్తే మీ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమవుతోంది అని అన్నారు. నిజంగా మీకు భద్రత కల్పించాలనుకుంటే నెల్లూరులో అనేక అవకాశాలున్నాయి అని తన లేఖలో పేర్కొన్నారు సోమిరెడ్డి. 

ప్రైవేటు సంస్థ ఆధీనంలోని వందల మందికి వంట చేసే సౌకర్యం ఉన్న భవనాల్లో నిర్బంధించినపుడే వారి ఉద్దేశం స్పష్టమవుతోంది సోమిరెడ్డి ఆరోపించారు. వైసీపీ నాయకులకు అధికారులకు వారి సన్నిహితులకు మందు అందించిన తర్వాతే సామాన్యులకు పంపిణీకి అనుమతి ఇచ్చేలా ఉన్నారన్నారు.  ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే ఆనందయ్యకు నిర్బంధం నుంచి విముక్తి లభిస్తుందని భావిస్తున్నాం..మీ భద్రత, స్వేచ్ఛ విషయంలో స్థానిక ఎమ్మెల్యేని కాదని ఎవరూ జోక్యం చేసుకోలేని పరిస్థితి వచ్చిందని సోమిరెడ్డి అన్నారు. ప్రపంచానికి ఒక ఆపద్బాంధవుడిలా నిలిచిన మిమ్మల్ని ప్రజలు దేవుడిలా భావిస్తున్నారు.. మరో బోధిధర్మలా కీర్తిస్తున్నారు అంటూ ఆనందయ్యను కీర్తించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో మీ అవసరం ప్రజలకు ఎంతో ఉంది.. ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా ధైర్యంగా పోరాడి విజయుడివై బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ లేఖను ముగించారు మాజీ మంత్రి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu