యూటీ జాబితాలో విశాఖ.. జగన్ పుణ్యమేనా...?

తెలుగు రాష్ట్రాలలో అధికారం అందని ద్రాక్ష అని తేల్చేసుకున్న బీజేపీ ఆ రెండు రాష్ట్రాలనూ ఆర్థిక చక్రబంధంలో ఇరికించేసి గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకుంటోందా అంటే ఔననే సమాధానమే వస్తుంది.  తెలుగు రాష్ట్రాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన రాజకీయ ప్రయోగశాలగా మార్చుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకూ రెవెన్యూ లేకుండా చేసి ఆర్థిక చక్కుల్లో పడేలా చేసి తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు.  ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను ఆ గడువు తీరిపోగానే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్రం యోచిస్తున్నదన్న సమాచారంతో పాటు.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక రెవెన్యూ వచ్చే విశాఖ నగరాన్ని కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న ప్రతిపాదన కూడా కేంద్రం వద్ద ఉందని విశ్వసనీయ వర్గాల కథనం.

 మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలనూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ద్వారా ఆ రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి కొట్టి ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయేలా చేసి ఆధిపత్యాన్ని చెలాయించాలన్నదే కేంద్రం వ్యూహంగా చెబుతున్నారు.  తొలుత  తెలంగాణ రాజధాని. దేశంలో  ఐదు అగ్ర నగరాల్లో ఒకటి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళుతున్న మహా నగరం. ఫార్మా, హెల్త్ హబ్ గా విలసిల్లుతోంది భాగ్యనగరం. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న నగరం హైదరాబాద్. అందుకే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కూడా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలనే సూచన చేశారని చెబుతారు. ఇటీవల కాలంలోనూ ఈ అంశం తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.  ప్రస్తుతానికి అయితే విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని. 2024 జూన్ వరకూ హైదరాబాద్ హోదా అదే.  హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజన సమయంలోనూ వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా నేతలు దీని కోసం గట్టిగానే పట్టుబట్టారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్ ను యూటీగా చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. అయితే ఆంధ్రా నేతల డిమాండ్ ను అప్పడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్  అంగీకరించలేదు. తెలంగాణ నేతలు కూడా ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించారు. అయితే ఏపీ, తెలంగాణకు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024 జూన్ వరకు ఇది వర్తిస్తుంది. 
ఉభయ తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసే సమయం దగ్గర పడుతున్న  నేపథ్యంలోనే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.   

 గతంలో అంటే ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ ప్రతిపాదన బలంగా తెరపైకి వచ్చింది. అప్పట్లో ఈ ప్రతిపాదనకు ప్రస్తుత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యతిరేకించారు.   దరిమిలా   హైదరాబాద్ ను  పదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాలఉమ్మడి రాజధానిగా  ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తరువాత పాలనా సౌలభ్యం కోసం, రాష్ట్రానికి సొంత రాజధాని నిర్మాణం లక్ష్యంతోనూ చంద్రబాబు అమరావతికి పాలనను షిఫ్ట్ చేశారు. పేరుకు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల రాజధాని అయినా.. ఆచరణలో మాత్రం హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా, అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతున్నాయి. ఆ తరువాత జగన్ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులంటూ కొత్త పల్లవి అందుకున్నా.. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను వినియోగించుకోవాలన్న ఆలోచన చేయలేదు.

వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ హోదా 2024 జూన్ తో ముగుస్తుంది. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం పూర్తయినా, కాకపోయినా ఏపీ హైదరాబాద్ పై హక్కులు కోల్పోయినట్లే.  అయితే  హైదరాబాద్ విషయంలో కేంద్రం ఆలోచన వేరుగా ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ.  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గందరగోళంలో పడేయటం లక్ష్యంగా  కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ అన్న అంశం మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది.  ఇప్పటికే తెలంగాణకు అప్పుల విషయంలో అవరోధాలు సృష్టిస్తున్న కేంద్రం.. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా మెలిక పెట్టే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. 

హైదరాబాద్ కు నలువైపులా రక్షణ శాఖ భూములు ఉండటం, రక్షణ పరంగా హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత వచ్చినా హస్తినను ఉదాహరణగా చూపి వ్యతిరేక గళాలు లేవకుండా నిరోధించొచ్చని కేంద్రం భావిస్తోంది. ఇక ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గతంలో అంటే రాష్ట్ర విభజనకు ముందు.. ఏదో విధంగా రాష్ట్రం సాధించుకోవడమే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అన్న ప్రతిపాదనకు ఓకే అన్నారు. ఇప్పుడు కేంద్రం దానినే సాకుగా చూపి ఈ ప్రతిపాదనతో వేగంగా ముందుకు కదిలే అవకాశాలున్నాయంటున్నారు.  

ఇక విశాఖ విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ చాలా చాలా  చాలా చాలా ఏమిటి అన్నీ కోల్పోయింది. హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయింది. భద్రాచలం రామాలయాన్ని కోల్పోయింది. ఆదాయాన్ని కోల్పోయింది. ఉపాధి అవకాశాలను కోల్పోయింది. విద్యాసంస్థలను కోల్పోయింది. పరిశ్రమలను కోల్పోయింది ఒ ముఖ్యంగా రెవెన్యూ లోటుతో భవిష్యత్ ఎలాగా అన్న భయం, ఆందోళన మాత్రమే విభజన కారణంగా ఏపీకి దక్కింది.

ఇన్నీ కోల్పోయినా ఆంధ్రులు మన విశాఖ ఉందిగా అనుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటైన విశాఖ సుందర నగరమే కాదు, పర్యాటక, వాణిజ్య పరంగా ప్రత్యేకత సంతరించుకున్న నగరం కూడా. ఈ నగరం ఒక టూరిస్ట్ స్పాట్. ఉపాధి, విద్యావకాశాల హబ్. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు, దేశ, విదేశీ టూరిస్టులు కూడా వేల సంఖ్యలో సందర్శించే నగరం విశాఖ. సాగర తీరం, ఉద్యానవనాలు, కొండలు, నైట్ లైఫ్, ఫుడ్ డెస్టినేషన్స్ ఇలా ఇక్కడ పర్యాటకులకు అవసరమైనవన్నీ ఒకే చోట కుప్పపోసినట్లు ఉన్న నగరం. ఇక పారిశ్రామికంగా విశాఖ ఏపీకి బంగారు గుడ్లు పెట్టే బాతు అని చెప్పాలి. అటువంటి విశాఖ నగరం గత మూడున్నరేళ్లుగా ప్రాభవాన్ని వేగంగా కోల్పోతోంది. జగన్ హయాంలో  పర్యావరణ విధ్వంసం జరుగుతోంది.

కోర్టులు, పర్యావరణ వేత్తలు, ఎన్జీటీ వంటి ట్రైబ్యునళ్లు ఎన్ని హెచ్చరికలు చేసినా ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఖాతరు చేయడం లేదు. యథేచ్ఛగా విశాఖ ఘనతను మసకబార్చే పనిలో ముందుకు సాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెవెన్యూలో రెండో స్థానంలో ఉన్న విశాఖ విభజన అనంతరం ఏపీకి మిగిలిన ఏకైక  ప్రధాన ఆదాయ వనరు.    విశాఖలో కేంద్ర సంస్థలు నేవీ, డిఫెన్స్, పోర్టులు ఉన్నాయి. కేంద్ర ఉద్యోగులు ఎక్కువ మంది  రిటైర్మెంట్ తర్వాత కూడా విశాఖలోనే స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు మొగ్గు చూపుతారు.  అయితే ఇప్పుడా పరిస్థితి వేగంగా కనుమరుగైపోతోంది.  భూ కబ్జాలు, పారిశ్రామిక వేత్తలకు వేధింపులు.. ఇలా విశాఖ తన ప్రశాంతతను కోల్పోతోంది. విశాఖ రాజధాని అని వైసీపీ ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచీ ఇక్కడ పొలిటికల్ రౌడీ యిజం పెరిగిపోయింది. సామాన్య జనమే కాదు.. పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడ నుంచి బిచాణా ఎత్తేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చేశారు. ఇక ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేస్తున్నా జగన్ సర్కార్ లో ఉలుకు, పలుకూ లేదు. విశాఖ జోన్ కు మంగళం పాడేసినా చీమకుట్టినట్లు కూడా అనిపించలేదు.  జగన్ సర్కార్ అశక్తతని, నిష్క్రియా పరత్వాన్నీ ఆసరాగా తీసుకుని విశాఖను కూడా ఏపీకి దక్కకుండా చేయడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది.

నిన్న మొన్నటి దాకా కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ అంటూ వచ్చిన కేంద్రం , విశాఖను కేంద్ర పాలిక ప్రాంతంగా మార్చి చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలకు కేంద్రంలోని మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ మేరకు హస్తిన స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆ ప్రతిపాదనల సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్రం నుంచి ఒక బృందం వచ్చి విశాఖను పరిశీలించి వెళ్లినట్లు చెబుతున్నారు. ఏపీకి ఉన్న ఏకైక ప్రధాన వనరు విశాఖ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న కేంద్రం యోచనకు ఆ నగర ప్రాశస్థ్యాన్ని, ఘనతను, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న జగన్ సర్కార్ తీరే కారణమని అంటున్నారు. 

ఇప్పటికే జగన్ నిర్వాకం వల్ల ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో, అందరి ఆమోదంతో, అమరావతి కేంద్రంగా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి  శ్రీకారం చుట్టారు.ఆ ప్రాంత రైతులు, నభూతో న భవిష్యతి అన్న విధంగా, రాజధాని కోసం 33,700 ఎకరాల భూమిని, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సిఆర్‌డిఎకు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.  రాజధాని  నగరానికి  ఒక రూపం స్వరూపం వస్తున్న సమయంలో, రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. 2019 ఎన్నికల్లో  ‘ఒక్క ఛాన్స్’ అభ్యర్ధనతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్ళు చల్లారు. అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలకు వాగ్దానం చేసిన ఆయన మాట తప్పారు. మడమ తిప్పారు. ప్రతిపక్ష నేతగా శాసన సభలో అమరావతికి జై కొట్టిన జగన్ రెడ్డి  అదే సభలో  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ప్రతిపాదనతో అగ్గి రాజేశారు.

2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారు. అంతే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. విభజిత రాష్ట్రానికి హైదరాబాద్ స్థాయిలో ఆదాయ వనరుగా ఎదుగుతుందని అంతా భావించిన అమరావతి పురోగతి నిలిచిపోయింది. ప్రస్తుతం ఉన్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న ఏపీ హైకోర్టు విస్పష్ట తీర్పు తరువాత కూడా జగన్ సర్కార్ తీరు మారలేదు. కోర్టు తీర్పుతో అసెంబ్లీలో మూడు రాజధానులు, సిఆర్‌డిఎ చట్టం బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్టు   ప్రకటించినా తమ విధానం మూడు రాజధానులే అంటూ వస్తోంది. కోర్టు తీర్పు ప్రకారం అమరావతి అభివృద్దికి ముందుకు అడుగులు వేయలేదు. అలా బంగారు గనిలా మారుతుందనుకున్న అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి విశాఖ నగరాన్ని కూడా రాష్ట్రానికి దక్కకుండా చేస్తోంది.

మొత్తం మీద విభజనకు ముందు ఏదోలా రాష్ట్రం సాధించుకుంటే చాలన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్ అప్పట్లో హైదరాబాద్ యూటీగా అభ్యంతరం లేదని చెప్పడాన్ని సాకుగా చూపి హైదరాబాద్ ను, అనుభవ రాహిత్యం, పాలనా వైఫల్యాలతో జగన్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన విశాఖ ప్రాభవాన్ని, ప్రాశస్థ్యాన్నీ దిగజారుస్తుండగాన్ని నెపంగా చూపి విశాఖపట్నాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.