మళ్లీ రాజ్యసభకు విజయసాయిరెడ్డి.. ఏ పార్టీ నుంచంటే?
posted on Apr 11, 2025 2:30PM

రాజకీయాలకు అలవాటు పడిన నేతలు వాటి నుంచి అంత సులభంగా బయటకు రాలేదు. విజయసాయి రెడ్డి అందుకు మినహాయింపేమీ కాదు. ఇటీవల వైసీపీ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. ఇక తాను రాజకీయాలకు పూర్తిగా దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అయితే ఆయన రాజకీయ సన్యాస ప్రకటనను అప్పట్లోనే ఎవరూ నమ్మ లేదు. రాజకీయ సన్యాసం కాదు, విరామం మాత్రమేనని అప్పట్లోనే రాజకీయవర్గాలలో పెద్ద చర్చ జరిగింది.
వాస్తవానికి జగన్ నేతృత్వంలోని వైసీపీలో ఒకప్పుడు నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి.. పార్టీ ఆవిర్భావం నుంచీ జగన్ తో కలిసి నడిచారు. అంతకు ముందు కూడా జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ కు సహ నిందితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అటువంటి విజయసాయి రెడ్డికి వైసీపీ వినా మరో ఆప్షన్ ఉండదనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా విజయసాయి వైసీపీని వీడటమే కాకుండా.. ఆ తరువాతి పరిణామాలలో జగన్ కు షాక్ ఇచ్చేలా కొన్ని అంశాలను రివీల్ చేశారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో కర్త, కర్మ, క్రియా అంతా జగన్ సమీప బంధువు సుబ్బారెడ్డి కుమారుడేనని చెప్పడం, అలాగే ఏపీ మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియా అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని రివీల్ చేయడం జగన్ కు మింగుడుపడని అంశాలే. విజయసాయి రెడ్డి నేరుగా జగన్ పేరు చెప్పకపోయినా ఆయన మాటల వెనుక అర్ధం ఆ రెండు వ్యవహారాలలోనూ తెరవెనుక ఉన్నది జగనేనని చెప్పకనే చెప్పారని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు.
అంతే కాకుండా ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ స్థానాన్ని ఉప ఎన్నికలో మళ్లీ ఆయనే బీజేపీ అభ్య ర్థిగా పోటీ చేస్తారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన తీరు కూడా ఉంది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ హైదరాబాద్ వచ్చిన వేళ విజయసాయి రెక్కలు కట్టుకుని వాలిపోయి ఆయనకు స్వాగతం పలికారు.
ఇప్పుడు తాజాగా స్వల్ప విరామం తరువాత విజయసాయి మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతారనీ, ఈ సారి ఆయన తన సేవలూ, విధేయతా బీజేపీ వైపు ఉంటాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం ఆయన రాజ్యసభకు వెడతారు. అయితే ఈ సారి బీజేపీ తరఫున ఆయన రాజ్యసభలో అడుపెడతారు. ఆ కథనాలకు బలం చేకూర్చే విధంగా విజయసాయి రెడ్డి మోడీని ప్రశంసలతో ముంచెత్తతూ శుక్రవారం ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ఉంది.
.webp)
ఆ పోస్టులో విజయ సాయి ముంబైపేలుళ్ల సూత్రధారి తహవ్వుర్ రాణా ను భారత్ కు రప్పించడం మోడీ దౌత్య విజయంగా అభివర్ణించారు. మోడీ నేతృత్వంలో దేశ భద్రతకు ముప్పు తలపెట్టిన ఏ ఉగ్రవాదినీ భారత్ వదిలిపెట్టబోదన్న సందేశాన్ని ప్రధాని మోడీ ప్రపంచానికి చాటారని విజయసాయి ఆ పోస్టులో పేర్కొన్నారు. దీంతో విజయసాయి బీజేపీ గూటికి చేరి, రాజ్యసభలో అడుగుపెట్టడానికి ఇంకెంతో సమయం పట్టదని పరిశీలకులు భావిస్తున్నారు.