బెయిల్ కోసం విజయసాయి రెడ్డి పిటీషన్
posted on Sep 25, 2013 7:16PM
జగన్ అక్రమాస్తుల కేసులో ఏ1 ముద్దాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిలు మీద విడుదల కావడంతో ఇక ఇవే కేసులలో ఉన్న ఇతర నిందితులు మెల్లమెల్లగా బెయిలు పిటీషన్లు దాఖలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిలు పిటీషన్ వేశారు. ఇప్పుడు జగన్ సంస్థల అడిటర్ విజయసాయి రెడ్డి, జగన్ సన్నిహితుడు సునీల్ రెడ్డిలు బెయిలు పిటీషన్లు దాఖలు చేశారు.
సునీల్ రెడ్డికి వాస్తవంగా ఎప్పుడో బెయిలు వచ్చేది. కానీ ఆయన ఇంతవరకు బెయిలు కొరకు ధరఖాస్తు చేసుకోలేదు. జైల్లో అతను జగన్ కు సహాయకుడిగా, పీఏ గా వ్యవహరించేవాడని, జగన్ ములాఖత్ ల పేరుతో ఎక్కువ మంది కలిసేందుకు వీలుగా ఇతను బెయిలు తీసుకోకుండా ఉన్నాడని ఆరోపణ ఉంది. జగన్ కు బెయిలు మంజూరయ్యే రోజు కూడా జగన్ కుటుంబ సభ్యులతో పాటు ఇతర రాజకీయ నాయకులు జగన్ ను కలిశారు. పరిమితికి మించి లోపలికి వెళ్లి జగన్ ను కలిశారు. అయితే ములాఖత్ ల రికార్డులలో మాత్రం ఇతరుల పేరు మీద ఉండడం విశేషం.