నాలుకలు కోసినా, కాళ్లు విరగకొట్టినా...
posted on Sep 25, 2013 7:08PM
తమ నాలుకలు కోసినా, కాళ్లు విరగకొట్టినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తమ పోరాటం ఆగదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు స్పష్టం చేశారు. హిందూపురంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అశోక్బాబు తెలిపారు. కావాలంటే తన ప్రసంగం సీడీలను టీఆర్ఎస్ నేతలకు ఇస్తామని తెలిపారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు దానిని వ్యతిరేకించాలని అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం జరుగుతుందని, 29న కర్నూలులో ఏపీ ఎన్జీవోల సభ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 30న భవిష్యత్ కార్యాచరణ ప్రకటన చేస్తామని అశోక్బాబు తెలిపారు.
తెలంగాణ సంస్కృతిని వేరుగా చూడాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలపై మేము ఎలాంటి విమర్శలు చేయలేదని అశోక్బాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలనే తమ ఉద్దేశమని, తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.