1971 యుద్ధ విజయానికి ఘన స్మారకం: విజయ్ దివస్..!

 

నేడు ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే ఏ దేశానికాదేశం,  వారి మిలిటరీ శక్తి సామర్ధ్యాలతో భయపెట్టి తమ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని,ప్రపంచ రాజకీయాల్లో తామే హీరో అవ్వాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రపంచంలోని  గొప్ప మిలిటరీ శక్తుల్లో ఒకటిగా పేరుగాంచిన భారతదేశం మాత్రం ఎప్పుడూ తన బలం, అధికారం చూపించుకోవటానికి ఏ దేశంపైనా మొదటిగా దాడి చేయలేదు. ఇప్పటికీ అదే సిద్దాంతం అనుసరిస్తుంది. అయితే ఒకానొక సమయంలో  మన పొరుగు దేశమైన పాకిస్తానుతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అది కూడా స్వార్ధ ప్రయోజనాల గురించి కాకుండా, పాకిస్తాన్ ప్రజల కోసమే చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధమే  మన  దేశ సైన్యపు శక్తి సామర్ధ్యాల గురించి ప్రపంచ దేశాలకి తెలిసేలా చేసింది. ప్రపంచ యుద్ధ చరిత్రలో మన దేశాన్ని హీరోని చేసింది. అలాంటి గొప్ప యుద్ధం గురించి, అందులో వీరోచితంగా పోరాడిన సైన్యపు త్యాగాల గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఆ  విజయాన్ని, విజయం తెచ్చిపెట్టిన సైన్యాన్ని స్మరించుకోవటానికి గానూ విజయ్ దివస్ జరుపుకుంటున్నారు.  సినిమా సక్సెస్ లు, సినిమాలలో హీరోల త్యాగాలు కాదు.. రియల్ లైప్ లో హీరోలుగా, ఒక యుద్దాన్ని విజయవంతం చేసిన వీరులుగా భారతీయ ఆర్మీని కొనియాడటానికి విజయ్ దివస్ వేదికగా మారుతుంది.


ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న, భారతదేశం విజయ్ దివస్‌ను జరుపుకుంటుంది. 1971లో  భారతదేశం, పాకిస్థాన్ల  మధ్య జరిగిన యుద్ధంలో విజయాన్ని బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి  మద్దతుగా భారతదేశం చేసిన త్యాగాలను స్మరించుకునే ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది.

యుద్దం ఎందుకు జరిగింది..

భారతదేశం, పాకిస్తాన్ విభజన జరిగిన తరవాత 1971కి ముందు పాకిస్తాన్ అనేది మన దేశానికి తూర్పు, పడమరల్లో కూడా ఉందేది. అయితే  తూర్పు పాకిస్థాన్(నేటి బంగ్లాదేశ్)  ప్రజలు పాకిస్థాన్ శాసనానికి వ్యతిరేకంగా ఆయుధ పోరాటం చేశారు. వారికి భారత దేశం మద్దతు దొరకటంతో  తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించి బంగ్లాదేశ్ దేశంగా మారింది. ఈ గొడవకంతటికి చాలా విషయాలు కారణాలుగా నిలిచాయి.  వాటిలో భాషా విభేదం చాలా ఉంది.  తూర్పు పాకిస్థాన్‌లో ఎక్కువ మంది బెంగాళీ మాట్లాడేవారు.  అయితే పశ్చిమ పాకిస్థాన్‌లో ఉర్దూను అధికార భాషగా ప్రకటించడం పట్ల తూర్పు పాకిస్థాన్‌లో నిరసనలు చెలరేగాయి. ఆర్థిక అసమానతలు కూడా విభేదాలకు కారణమయింది.  మొత్తం పాకిస్తాన్  ఆర్ధికాదాయంలో తూర్పు పాకిస్థాన్ నుంచి అధిక  ఆర్థిక ఆదాయం సమకూరుతున్నప్పటికీ, దాని ప్రయోజనాలు మాత్రం పశ్చిమ పాకిస్థాన్‌ పొందేది. దీని వ్ల  తూర్పు పాకిస్తాన్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగేది.  రాజకీయకంగా కూడా రెండు భాగాలలో విబేధాలు ఎక్కువగా ండేవి1970 ఎన్నికల్లో అవామీ లీగ్, షేక్ ముజీబుర్ రెహ్మాన్ నాయకత్వంలో తూర్పు పాకిస్థాన్‌లో విజయం సాధించింది. అయినప్పటికీ పశ్చిమ పాకిస్థాన్  ఈ విజయాన్ని అంగీకరించలేదు. వీటన్నింటి వల్ల పాకిస్తాన్ లోనే రెండు భాగాల మధ్య విభేదాలు చాలా ఎక్కువ అయ్యాయి.

పాక్ దాడి-  భారత్ ప్రతిస్పందన ఎలా ఉందంటే..


మార్చి 26, 1971న, పాకిస్థాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్‌ లైట్ ప్రారంభించి, తూర్పు పాకిస్థాన్‌లో బెంగాళీ ప్రజలను పీడించటం మొదలుపెట్టింది. దీంతో భయపడిపోయిన దాదాపు  కోటిమంది  శరణార్థులు తూర్పు పాకిస్థాన్ నుంచి భారతదేశంలోకి వచ్చారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, మెఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోకి వచ్చారు. ఇదిలాగే కొనసాగితే భారత దేశం సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందన్న నిజాన్ని గ్రహించి, ఈ పరిస్థితిని చక్కబెట్టటానికి భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

మొదట భారతదేశం ఈ పరిస్థితిని దౌత్యపరంగా పరిష్కరించాలనే  ప్రయత్నించింది. కానీ, ప్రపంచదేశాల  నుండి తగిన ప్రతిస్పందన రాకపోవడంతో భారతదేశం సైనిక చర్య చేపట్టింది. భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, తూర్పు పాకిస్తాన్ ప్రజలతో ఏర్పడిన స్వాతంత్ర సైన్యమైన ముక్తి బహిని సైన్యానికి పూర్తి మద్దతు అందించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ విజయ్ మొదలైంది.

1971 డిసెంబర్ 3వ తేదీన భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇది 13 రోజులపాటూ  కొనసాగి డిసెంబర్ 16న ముగిసింది. ఇందులో ఆపరేషన్ విజయ్ ద్వారా భారత సైన్యం, ముక్తి బహినిసైన్యంతో కలిసి, తూర్పు పాకిస్థాన్‌లో ఉన్న  పాకిస్థాన్ సైన్యాన్ని ఎదుర్కొని అనేక విజయాలు సాధించింది.  ఈ యుద్దంలో పలు చిన్నచిన్న యుద్దాలు సాగాయి.  వీటిలో లాంగేవాలా యుద్ధం, ఆపరేషన్ ట్రైడెంట్ వంటివి ఉన్నాయి. డాకాలో 93,000 మంది పాకిస్థాన్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోవటంతో ఈ యుద్ధానికి తెర పడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సైనికులు  లొంగిపోయిన యుద్ధంగా ఇది  చరిత్రలో నిలిచింది.

1971,  డిసెంబర్ 16వ తేదీన, బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ యుద్ధంలో సుమారు 3,900 భారత సైనికులు అమరులయ్యారు, 9,851 మంది గాయపడ్డారు. వారు సాదించిపెట్టిన విజయానికి  గుర్తుగా,  సైన్యం చేసిన  త్యాగాలకి స్మరించుకుంటూ  భారతదేశంలో ఈ రోజుని  విజయ్ దివస్‌గా,  బంగ్లాదేశ్‌లో విజయ్ దిబోష్‌గా జరుపుకుంటారు.  ప్రతీ పౌరుడు మానవత్వంతో మన దేశం, సైన్యం చేసిన త్యాగాలని  స్మరించుకుని,  భారతీయుడిగా గర్వపడాలి. వీటి నుంచి ముఖ్యంగా యువత    స్ఫూర్తిని పొందాలి.

                                                   *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu