తెదేపా స్థానంలోకి వైకాపా ప్రవేశించాలని చూస్తోంది: వెంకయ్యనాయుడు

 

గుంటూరులో నిన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం శంఖుస్థాపన కార్యక్రమ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చురకలు వేశారు. తెదేపా-బీజేపీలు విడిపోతే తెదేపా స్థానంలోకి రాష్ట్రంలో ఒక పార్టీ (వైకాపా) ప్రవేశించాలని ఆశగా ఎదురుచూస్తోందని కానీ చంద్రబాబు నాయుడు-నరేంద్ర మోడీ జోడీ అయితేనే వేగంగా రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు భావించి వారిని ఎన్నుకోన్నారనే సంగతి ఆ పార్టీ గ్రహిస్తే బాగుంటుందని అన్నారు. తెదేపా బీజేపీకి దూరం అయితే దాని స్థానంలోకి ప్రవేశించాలనే ఆ పార్టీ కోరిక ఎన్నటికీ తీరే అవకాశాలు లేవని అన్నారు. ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాను నిర్లక్ష్యం చేయడం లేదని కానీ కొందరు రాజకీయనాయకులు తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను రెచ్చగొడుతున్నారని అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని వెంకయ్య నాయుడు హితవు పలికారు.