అశోక్ కు అవమానం.. నో రేషన్.. సీఎం ఫామ్ హౌజ్ లో కలకలం.. వామ్మో ఒమిక్రాన్.. టాప్ న్యూస్@1PM
posted on Dec 22, 2021 11:49AM
కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజును ఏపీ ప్రభుత్వం తీవ్రంగా అవమానించింది. రామతీర్థం బోడికొండ ఆలయ పున:నిర్మాణ పనుల కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. శంకుస్థాపన బోర్డుపై అశోక్గజపతిరాజు పేరును లేకుండా చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన తనను విస్మరించడంతో అశోక్గజపతిరాజు ఆవేదనకు లోనయ్యారు. అక్కడున్న శంకుస్థాపన బోర్డు తీసివేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు అశోక్గజపతిరాజును తోసేశారు.
----
ఆంధ్రప్రదేశ్ లో పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులను అర్థం చేసుకోవాలని సీఎం జగన్కు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా బతుకుతారని ఆయన సీఎంను నిలదీస్తూ ట్వీట్ చేశారు.'పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. వాళ్లు బతికేదెలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు? మీ చర్యలతో వాళ్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయ చేసి వాళ్ల జీతాలు వారికి ఇప్పించండి' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు.
-------
విశాఖలో రూ. 200 కోట్ల భూవివాదం చోటుచేసుకుంది. స్మార్ట్సిటీ కార్పొరేషన్చైర్మన్ జీవీపై హయగ్రీవ ఇన్ఫ్రా చైర్మన్ జగదీశ్వరుడు తీవ్ర ఆరోపణలు చేశాడు. ప్రభుత్వ పెద్దల పేరుతో జీవీ బెదిరిస్తున్నాడని ఆరోపణలు చేశారు. యండాడలో రూ.200 కోట్ల విలువైన భూమిని బలవంతంగా రాయించుకున్నారని ఆరోపించారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ సహకారంతో తనను తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు
-----
బియ్యం కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే ఉచిత బియ్యానికి ఏపీలో తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఈ నెల 18 నుంచే పంపిణీ కావా ల్సిన బియ్యం ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఈ ఏడాది నవం బరు నెల నుంచి ఉచిత బియ్యం పంపిణీ ఉండదని ఇంతకు ముందు చెప్పినా ఈ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించారు. అయితే డిసెంబరు నెలలో పంపిణీ ఇంతవరకు ప్రారంభం కాలేదు.ఈనెలలో ఇక పంపిణీ లేనట్టేనని తెలుస్తోంది.
--------
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ లో కలకలం రేగింది. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో కూలి పనికి వెళ్లిన యువకుడు చనిపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. యువకుడు అక్కడి వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యులు ఎర్రవెళ్లి ఫాహౌస్ ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఘటనతో సీఎం కేసీఆర్ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.
---------
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రులకు కనీసం సమయం కూడా ఇవ్వలేదని... ఇదే సమయంలో బీజేపీ నేతలకు మాత్రం సమయం ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర మంత్రులను పట్టుకుని వారికి పని లేదు అని అంటారా? అని మండిపడ్డారు.
----------
రైతులపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రేమ లేదనివ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మండిపడ్డారు. బీజేపీని బద్నాం చేసేందుకే టీఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ప్రజలను వదిలేసి ఢిల్లీకి ఎందుకు వచ్చారని బరాబర్ అడుగుతామని చెప్పారు. రైతులను అడ్డం పెట్టుకుని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-------
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం రాఘవపురంలో పేకాటశిబిరంపై పోలీసుల దాడి చేశారు. పేకాట ఆడుతూ తహశీల్దార్ కిషోర్బాబు పోలీసులకు పట్టుబడ్డారు. పేకాడుతూ పోలీసులకు కొత్తపేట తహశీల్దార్ కిషోర్బాబు చిక్కాడు. మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 సెల్ఫోన్లు, రూ.94 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
------
క్రికెటర్ను చేస్తామని చెప్పి నారాయణగూడకు చెందిన ఓ మహిళా క్రికెటర్ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. నారాయణగూడలో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న ఓ యువతి, ఆమె సోదరుడుకు మానవ హక్కుల నుంచి ఫోన్ చేస్తున్నామని, మీకు మంచి భవిష్యత్తు ఉందని మాయమాటలు చెప్పి నమ్మించారు. వారి నుంచి సైబర్ నేరగాళ్లు ఒక లక్షా ఇరవై వేలు దండుకున్నారు. రెండు నెలలుగా బుకాయిస్తుండడంతో బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-------
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో కొత్తగా లక్షా 81 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.వాటిలో అధిక శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని వివరించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
---