తిరుపతి జిల్లాలో కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు .. ఐదుగురు మృతి
posted on Apr 28, 2025 5:22PM
.webp)
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు క్షతగాత్రుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను తమిళనాడులోని కృష్ణగిరి వాసులుగా గుర్తించారు.
మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, దాదాపు 9 ఏళ్ల వయసున్న బాలుడు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. ఈ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.