టెక్స్ట్ నెక్ సిండ్రోమ్..వామ్మో యూత్ లో పెరిగిపోతున్న ఈ వ్యాధి గురించి తెలుసా?

 


ప్రపంచవ్యాప్తంగా యువతలో  టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనే వ్యాధి పెరిగిపోతోందట. సోషల్ మీడియా మొత్తం ఈ వ్యాధి గురించి కోడై కూస్తోంది.  జీవనశైలి,  ఆహారం.. ఈ రెండూ  ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేశాయి. యువత  కూడా ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. యువతలో పెరుగుతున్న మధుమేహం,  రక్తపోటు సమస్య నిపుణులను ఆందోళనకు గురిచేయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా యువతలో పెరుగుతున్న టెక్స్ట్ నెక్ వ్యాధి ఇప్పుడు అందరిని కలవర పెడుతోంది. ఈ సమస్య భరించలేని నొప్పిని కలిగించడమే కాకుండా అనేక  అసౌకర్యాలను కూడా పెంచుతుందని అంటున్నారు. అసలు టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనే సమస్య ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? దీని నివారణకు ఏం చేయాలి? తెలుసుకుంటే..

 టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనేది కొత్త పదం. దీనిని టెక్ నెక్ లేదా స్మార్ట్‌ఫోన్ నెక్ అని కూడా అంటారు. ముందుకు వంగి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువసేపు చూడటం వలన మెడపై అదనపు ఒత్తిడి,  టెన్షన్ పెరుగుతుంది. దాని కారణంగా టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ సమస్య వస్తుంది. సింపుల్ గా  అర్థం చేసుకుంటే స్క్రీన్ వైపు చూసేందుకు  తలను ముందుకు,  క్రిందికి వంచినప్పుడు టెక్స్ట్ నెక్ సమస్య ఏర్పడుతుంది.  దీని కారణంగా మెడ  వెన్నెముకపై ఒత్తిడి మళ్లీ మళ్లీ పెరుగుతుంది.

కదల్చకుండా ఉన్నప్పుడు  మనిషి తల 10-12 పౌండ్ల (నాలుగున్నర నుండి ఐదు కిలోల వరకు) మధ్య బరువు ఉంటుంది.  కానీ ముందుకు వంగినప్పుడు ఈ బరువు పెరుగుతుంది. ఇది మెడ కండరాలు,  వెన్నెముకపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.  35 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు టెక్స్ట్ నెక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని తేలింది. 15-18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ సమయం గడిపేవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ మెడ, ఎగువ వీపు,  భుజాలలో నొప్పిని కలిగిస్తుంది.

సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే మెడ నొప్పి చుట్టుపక్కల కండరాలను కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ఎగువ వెనుక కండరాలలో అసమతుల్యత ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనితో పాటు  కొంత సమయం పాటు మెడను ఒకే భంగిమలో ఉంచడంలో ఇబ్బంది పడవచ్చు. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ సమస్య కాలక్రమేణా మీ 'జీవన నాణ్యత'పై కూడా ప్రభావం చూపుతుంది.

పరిష్కారాలు..

టెక్స్ట్ నెక్ సమస్య రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యువకులు తమ ఫోన్‌లతో ఎక్కువ నిమగ్నమై ఉంటారు కాబట్టి, వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు సరైన భంగిమలో ఉండటం ముఖ్యం.  మెడను చాలా ముందుకు వంచకూడదు.  ఏ వస్తువు వాడినా దాన్ని కంటి ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

మెడ మరియు భుజాలను సాగదీయడానికి,  విశ్రాంతి తీసుకోవడానికి తరచుగా విరామం తీసుకోవాలి.

ల్యాప్‌టాప్ స్టాండ్‌లు,  ఫోన్ హోల్డర్‌లను ఉపయోగించడం ద్వారా కూడా టెక్స్ట్ నెక్ సిండ్రోమ్‌ను నివారించవచ్చు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే కొంత సమయం వరకు మెడ లేదా వెన్నునొప్పి ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకూడు.  ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.


                                                              *రూపశ్రీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu