సీఎం కేసీఆర్కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ.. జగన్ వైఫల్యాలపై నిలదీత..
posted on Aug 29, 2021 3:39PM
ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. లేఖలో ఏపీ ప్రభుత్వ వైఫల్యంపై దుయ్యబట్టారు. వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రం, కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్ను కోరారు. ఆ మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి లేఖ రాశారు.
‘‘వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతుల్లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోంది? కేంద్ర గెజిట్లో ప్రాజెక్టును చేర్చకపోవడం ఏపీ ప్రభుత్వ వైఫల్యమే. ఇది సర్కారు వైఫల్యమే తప్ప ప్రాజెక్టుకు అనుమతులు లేనట్టు కాదు. విభజన చట్టం ప్రకారం 6 ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది. కల్వకుర్తి, నెట్టెంపాడు సహా వెలిగొండ అనుమతిని గుర్తు చేస్తున్నాం. కేంద్ర గెజిట్లో వెలిగొండను చేర్చండి అని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినా నిర్లక్ష్యం వహించారు. కేంద్రమే వెలిగొండకు అనుమతులిచ్చి ఇప్పుడు గెజిట్లో స్థానం ఇవ్వలేదు. ఇది మా జిల్లా రైతుల తప్పా? ఏపీ ప్రభుత్వ తప్పిదాలను సాకుగా చూపించి ఫిర్యాదులు చేయడం తగదు. కేంద్రం, కేఆర్ఎంబీకి తెలంగాణ చేసిన ఫిర్యాదు, రాసిన లేఖతో ప్రకాశం జిల్లా రైతుల్లో కలవరం మొదలైంది’’ అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో తెలిపారు.