కడప గడ్డన ముగిసిన మహా సంబరం
posted on May 29, 2025 7:36PM

రాయలసీమ నడిబొడ్డు కడప గడ్డన నిర్వహించిన పసుపు పండగ పసుపు దండు ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. ఉత్తంగ తరంగమై అన్ని దారులు కడప వైపు అన్నట్టు పెను ప్రవాహంలో తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలి వచ్చి జోష్ నింపారు .ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా నేతలు ,కార్యకర్తలు అభిమానులు రావడంతో కడప ఈ మూడు రోజులు మినీ సమైక్యాంధ్ర ను తలపించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ,జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుల ప్రసంగాలు ఆకట్టు కొనడమే కాదు పార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రధాన్యం ఇస్తూ మాట్లాడం వారిలో మరింత భరోసా నింపింది .అందరి నాయకులకు వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తల కరతాళధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగింది.
*కడప వేదికగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడు ఈసారి కడపలో నిర్వహించడంతో మరోసారి చంద్రబాబు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక కావడానికి కడప వేదికైంది .ఆ హోదాలో చంద్రబాబు నాయుడు ప్రసంగించి తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలకు సేవలకు జోష్ నింపారు .మీకు నేనున్నాను పార్టీ ఉంది మనం కష్టపడదాం ప్రజలకు మంచి చేద్దాం అంటూ పార్టీ శ్రేణులకు స్థైర్యాన్ని ఇచ్చారు.
*కలివిడిగా లోకేష్
రాష్ట్ర సాంకేతిక ,విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహానాడులో కలివిడిగా తిరుగుతూ అందరితో మాట్లాడుతూ సీనియర్ నాయకులను గౌరవిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించారు. ఎక్కడ తారతమ్య భేదాలు ప్రదర్శించకుండా అవకాశం దొరికిన మేరకు అందరితో ముచ్చటిస్తూ వచ్చారు. మీడియా పాయింట్ లో సైతం అయన మాట్లాడేందుకు వేదికపై కూర్చుంటారని జర్నలిస్టు భావించారు. అయితే ఆయన నేరుగా వచ్చి వేదిక మీదే కుర్చీలో కాకుండా ఒక వారన క్రింద కూర్చొని అందరితో కలిసి మాట్లాడుతూ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చారు. ఎక్కడా విసిగించుకోకుండా ప్రశ్నించిన ప్రతి వారితో నవ్వుతూ మాట్లాడుతూ సమాధానం ఇవ్వడం ఆయన పరిణితికి నిదర్శనంగా చెప్పవచ్చు.
*ప్రత్యేక ఆకర్షణగా యన్టీఆర్ గ్యాలరీ.
మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ మహానాడుకు వచ్చిన వారిని బాగా ఆకర్షించింది .మొదటి రెండు రోజుల్లో ప్రతిధుల మహాసభకు దక్షిణం వైపు ఏర్పాటుచేసిన ఈ గ్యాలరీలో ఒక భాగం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటివి పాత చిత్రాలు రంగుల్లోనూ బ్లాక్ అండ్ వైట్ లోను ప్రదర్శించడం చూసేవారికి ఆసక్తి కలిగించింది .ఎన్టీఆర్ గారి తో పాటు దాని పక్కన చంద్రబాబు ,లోకేష్ ఫోటో గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే మహానాడు చివరి రోజున గురువారం ఆ గ్యాలరీ లో ఫోటోలు తీసివేయడంతో లక్షల సంఖ్యలో వచ్చిన వారు వాటిని వీక్షించలేకపోయారు.
*అనుకూలించిన వాతావరణం
మహానాడు మరో నాలుగు రోజుల్లో మొదలవుతుందన్న ప్పట్నుంచి వర్ష వస్తుందేమో అన్న ఆందోళన కలిగిస్తూనే వస్తోంది .మహానాడు మొదలయ్యే ముందు రోజు కూడా వర్షం కురవడంతో నిర్వాహకుల్లో ఆందోళన తప్పలేదు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాంగణంలో వేదికల టెంట్ ల చుట్టూ ముందు జాగ్రత్త చర్యగా కాలువలు తవ్వించారు . 27 నుంచి మూడు రోజులపాటు మహానాడు ముగిసేవరకు వర్షాలు రాకపోగా వాతావరణం కూడా చల్లబడడంతో మహానాడు మరింత విజయవంతం కావడానికి కారణం అయ్యింది . టిడిపి నాయకులు కూడా ఊపిరి పిల్చుకున్నారు.
*సీమగడ్డన వరాల జల్లు
కడపలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు జరుగుతుందంటే కడప తో పాటు రాయలసీమ వాసులు ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఏవైనా హామీలు ఇస్తారని భావించడం సహజమే.. అయితే అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమతో పాటు రాష్ట్రంలో చేపట బోయే అభివృద్ధి పనులను మహానాడు వేదికగా ప్రకటించారు. రాయలసీమ విషయానికొస్తే రాయలసీమను సుభిక్షం చేసేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని సీమను కరువు సీమగా ,ఎడారి సీమ గా కానివ్వమని భరోసా ఇచ్చారు. తెలుగు గంగా, హంద్రీ నీవా-నీవా, గాలేరు -నగరి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని ఆ తర్వాత తాను బాధ్యతలు చేపట్టాక వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు .సీమ ప్రాజెక్టులకు 3500 కోట్లు కట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది పోలవరం తర్వాత ఎక్కువ స్టైల్ నిధులు కట్ చేసిన ప్రాజెక్టు పందిరి అని అన్నారు 2027 నాటికి జాతికి అంకితం చేస్తామని పోలవరంపై స్పష్టత ఇవ్వడం జరిగింది. వంశధార నుంచి పెన్నా వరకు నదులు అనుసంధానం చేయాలన్నది తమ లక్ష్యం అని తన సంకల్పాన్ని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధిని అగ్రభాగంలోని బాధ్యత తమదే అని హామీ ఇవ్వడం జరిగింది.
*ఉక్కుకు మోసులు
కడుపుతో పాటు రాయలసీవాసులు ఎప్పుడెఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వడం ఈ ప్రాంత వాసుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.దాదా20ఏళ్ళు గా 20 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఉక్కు సంకల్పానికి పునాదిరాళ్లు తప్ప పూర్తి చేసిన పరిస్థితులు లేవు. అయితే ముఖ్యమంత్రి మహానాడులో 10 రోజుల్లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తామని రెండు దశల్లో రూ,9,000 కోట్లతో రాయలసీమ స్టీల్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తితో నిర్మాణం చేపడతామని ప్రకటించారు. జిందాల్ సంస్థ నిర్మించే ఈ స్టీల్ ప్లాంట్ లో 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయని,ఈ ప్లాంట్ కు శంకుస్థాపనతో పాటు నేనే ప్రారంభోత్సవం చేస్తారని చెప్పడం పై ఇక్కడి వాసుల్లో నమ్మకం కుదురుతోంది. పర్యాటపరంగా గండికోటను అభివృద్ధి చేస్తామని, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని భవిష్యత్తులో అంతా టూరిజమేఅని చెబుతూ గండికోట అభివృద్ధి చేయడంతో పాటు శ్రీశైలం,తిరుపతి క్షేత్రాలను మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు .మహానాడు కడపలో పెట్టిన నేపథ్యంలో ఇలాంటి హామీలు ఇవ్వడం సీమవాసుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది