వైసీపీపై సానుభూతి లేదు.. ప్రొఫెసర్ నాగేశ్వర్
posted on Jun 8, 2025 9:34AM

వైసీపీ నేతల అరెస్టులను జనం పట్టించుకోవడం లేదు.. కాగడా పెట్టి వెతికినా సానుభూతి కానరావడం లేదు!వైసీపీ ఆశలపై ఆ పార్టీ సానుభూతి పరుడు, జగన్ కు వీరాభిమాని అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ నీళ్లు చల్లేశారు. ప్రొఫెసర్
నాగేశ్వర్ వైసీపీకీ, జగన్ కు సానుభూతి పరుడన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. ఆయన తన వీడియోలు, విశ్లేషణల ద్వారా జగన్ కు గట్టి మద్దతుదారుగా గుర్తింపు పొందారు. తాను తటస్థ విశ్లేషకుడిననీ ఎటువైపూ మొగ్గు లేదని చాటుకోవడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్నడూ ప్రయత్నించిన దాఖలాలు
లేవు. అటువంటి కరుడుగట్టిన జగన్ మద్దతుదారు.. తాజాగా తన విశ్లేషణలో జగన్ పార్టీ గాలి తీసేశారు. ఇప్పుడు వైసీపీ తమ నేతలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నదంటూ ఊరూ వాడా ఏకం చేసేలా గగ్గోలుపెడుతున్నారు. ఈ అక్రమ అరెస్టులతో తమ పార్టీపై ప్రజా సానుభూతి వెల్లువెత్తుతందని గంపెడాశతో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో ఈ అరెస్టులను ప్రజలు అసలు పట్టించుకోవడం లేదనీ, కాగడా పెట్టి వెతికినా ప్రజలలో వైసీపీ పట్ల కానీ అరెస్టైన ఆ పార్టీ నేతల పట్ల కానీ సానుభూతి కనిపించడం లేదని కుండబద్దలు కొట్టేశారు.
ఆయన ఏమన్నారంటే జనం మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి చేయడాన్ని జనం కళ్లారా చూశారనీ, అటువంటి జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చస్తే జనానికి సానుభూతి కలుగుతుందని వైసీపీ ఎలా భావిస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు.
అదే విధంగా వల్లభనేని వంశీ విషయంలోనూ ప్రజలలో సానుభూతి కనిపించడం లేదని అన్నారు. నారా భువనేశ్వరిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అటువంటి వంశీపై కేసులు పెడితే తప్పేమిటని జనం భావిస్తున్నారే తప్ప అయ్యే వంశీ అరెస్టైయ్యారా, కేసుల్లో ఇరుక్కున్నారా అని సానుభూతి చూపడం లేదన్నారు. వైసీపీ ఇప్పుడు తన సొంత తప్పులకు మూల్యం చెల్లిస్తోందని, అధికారంలో ఉండగా చేసిన అరాచకాలకు ఫలితం అనుభవిస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. వైసీపీకి చెందిన పలువురు నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టైన తరువాత కూడా ప్రజలలో ఇసుమంతైనా సానుభూతి కనిపించడం లేదు సరికదా.. తగిన శాస్తి జరిగిందన్న భావనే వ్యక్తమౌతోందని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.