మాగంటి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు... అధినేత కేసీఆర్ సంతాపాలు

 

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్  ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాగంటి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ  ప్రయాణం ప్రారంభించిన గోపీనాథ్ పలు పదవులను సమర్థవంతంగా నిర్వహించారని చంద్రబాబు ఎక్స్ ద్వారా పేర్కొన్నారు..గోపీనాథ్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని చంద్రబాబు తెలిపారు. 

మరో వైపు సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లిహిల్స్ నియోజకవర్గ శాసన సభ్యుడు…మాగంటి గోపీనాథ్ అకాల మరణంతీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ట్వీట్టర్ వేదికగా తెలిపారు.  ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని పేర్కొన్నారు.బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, టి. హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటని కేసీఆర్ అన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారన్నారు. మాగంటి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఆయన అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్‌ను కోల్పోవడం బీఆర్ఎస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. మరోవైపు కేటీఆర్, టి. హరీశ్ రావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు.కాగా, గోపీనాథ్ మృతి నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు నల్లగొండ, ఖమ్మం జిల్లాల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన అంత్యక్రియలను మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జరుగనున్నారు. గోపీనాథ్‌ అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది.