స్థానికం కోసమే నా? మంత్రివర్గ విస్త‘రణం’!

చివరాఖరికి  కాంగ్రెస్ అధిష్టానం  తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్  సిగ్నల్ ఇచ్చింది.  ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ మెగా సీరియల్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది. ఆదివారం (జూన్ 8) మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే విస్తరణ పూర్తి స్థాయిలో ఉంటుందా లేక ‘పీస్ మీల్’ లెక్కన ఉంటుదా అనే విషయంలో  మాత్రం స్పష్టత లేకపోయినా విశ్వసనీయ సమాచారం మేరకు, ఈసారికి పీస్ మీలే అంటున్నారు. ఈసారికి ఫిఫ్టీ పెర్సెంట్ ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది కేబినెట్‌‌లో మంత్రులుగా ఉన్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అయిత అరుకు ఆరు ఒకేసారి భర్తీ చేస్తే  ఎదురయ్యే ఉపద్రవాన్ని ఎదుర్కోవడం కష్టమనే.. ముందు చూపుతో కాంగ్రెస్ అధిష్టానం  ప్రస్తుతానికి ముగ్గురితో సరి పెట్టాలని చూస్తోందని అంటున్నారు.  అయితే.. ఈ సంఖ్య ఇంకొకటి పెరిగినా పెరగ వచ్చని అంటున్నారు. ఇంత వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి మాత్రమే చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు..  ఈ విస్తరణలో  రెడ్డి సామజిక వర్గానికి బెర్త్ దక్కే ఛాన్స్ లేదనీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న ప్రస్తుత విస్తరణలో  బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ కోటాలో ఎవరిని అదృష్టం వరిస్తుందనే విషయంలోనూ ఇంకా పూర్తి క్లారిటీ లేదు. అయితే.. మంత్రివర్గంలో స్థానం కోసం నేరుగా ఢిల్లీ తో డీల్ చేస్తున్న విజయశాంతి, ముఖ్యమంత్రి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముచ్చట పడుతున్న అద్దంకి దయాకర్ కు ప్రస్తుత విస్తరణలోనే స్థానం దక్కవచ్చని అంటున్నారు.    

అయితే నిజానికి మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు  సామాజిక వర్గాలు, సీనియారిటీ వంటి అంశాలతో సంబంధం లేకుండా  ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా, ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు తెలుస్తోంది. నిజనికి  గాంధీ భవన్  లో వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి ప్రతి ఇద్దరు ఎమ్మెలేలలో ఒకరు వంతున మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎవరి కార్డ్ వారు ప్లే  చేస్తున్నారు. ముఖ్యంగా..  ఎస్సీ,  రెడ్డి సామాజిక వర్గం నేతల నుంచి వత్తిడి ఎక్కువగా  ఉందని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగా రెడ్డి, బహిరంగంగానే బరిలో దిగిన విషయం తెలిసిందే. 

 అలాగే,ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రి వర్గంలో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా వచ్చిన తర్వాత  ఆశావాహులంతా   ఆమె కలిసి మంత్రి పదవి కోసం వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ సామాజికవర్గానికి కేబినెట్‌లో ప్రాధాన్యత లేదు. ముదిరాజ్‌‌లకు కచ్చితంగా అవకాశం ఇస్తానని గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి  రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మైనార్టీలకు కూడా కేబినెట్‌లో చోటు లభించ లేదు.

ఈ క్రమంలో రేపటి కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  చివరకు..  అనే నేను..అనే వరకు ఏమి జరుగుతుంది. ఎన్ని ఖాళీలు భర్తీ అవుతాయి.. ఎవరిని, మంత్రి పదవి వరిస్తుంది అనేది చెప్పడం  క్షేమం కాదు అంటున్నారు. అయితే..  ప్రస్తుత విస్తరణ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అనే మాట కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులు, ఉద్వాసనలతో పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు.