టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..
posted on Apr 29, 2021 3:40PM
అది కృష్ణా జిల్లా. ఆయన పేరు కాగితపు వెంకట్రావ్. పెడన మాజీ ఎమ్మెల్యే. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన నాయకుడు. ఆయన మరణం టీడీపీ ఒక లోటు.. మొన్నటికి మొన్న వెస్ట్ గోదావరి జిల్లా యువజన నాయకుడు మరణించాడు. అది మారిపోక ముందే కాగిత వెంకట్రావు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గత కొన్నిరోజులుగా కాగిత వెంకట్రావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మచిలీపట్నంలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు. కాగిత వెంకట్రావు స్వగ్రామం నాగేశ్వరరావు పేట. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ రాజకీయ వారసత్వం అందుకోగా, కుమార్తె వైద్య నిపుణురాలు.
కాగిత వెంకట్రావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగితపు వెంకట్రావ్ బీసీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని. వెంకట్రావు మరణం పార్టీకి తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. లోకేశ్ స్పందిస్తూ.... కాగిత వెంకట్రావు టీటీడీ మాజీ చైర్మన్ గానూ విశేష సేవలందించారని, తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలా నిలిచారని కొనియాడారు. వెనుకబడిన తరగతులకు చెందిన నేతగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చిరస్మరణీయం అని కీర్తించారు. కాగితపు వెంకట్రామ్ మృతి పట్ల కృష్ణ జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.