వరదల పాపం కొత్తజంటలదే-స్వామి స్వరూపానంద

రోజుకోక వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కుతున్న ద్వారకా శారదా పీఠం శంకరాచార్య..స్వామి స్వరూపానంద సరస్వతి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్లి 2013లో కేదార్‌నాథ్ ప్రాంతంలో సంభవించిన వరదలకు హనీమూనర్లే కారణమన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి విహారయాత్రలకు వస్తుంటారని వారిలో కొత్తగా పెళ్లయిన వారు కూడా ఉంటారు. వారు పరమ పవిత్రమైన, దేవతలు సంచరించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అపవిత్రమైన పనులు చేస్తున్నారని అందుకే అంతపెద్ద ఎత్తున వరదలు సంభవించాయని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పవిత్ర ప్రాంతాల్లో అలాంటి అపవిత్రమైన పనులు ఆపకపోతే ఇంతకంటే భయంకరమైన విపత్తులు మళ్లీ మళ్లీ తప్పవని హెచ్చరించారు.