తెలంగాణలో ఎఐ అధారిత డేటా సెంటర్.. 3500 కోట్లతో ఏర్పాటు చేయనున్న సింగపూర్ సంస్థ!

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ సంస్థ ముందుకు వచ్చింది. పెట్టుబడుల ఆకర్షణే ద్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన బృందంతో శనివారం ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి ఎస్టీటీ తెలంగాణలో 3500 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది.

ఈ మేరకు తెలంగాణ సర్కార్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముచ్చర్ల సమీపంలోని మీర్ ఖాన్ పేటలో ఏఐ ఆధారిత  డెటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఎస్టీటీ డేటా సెంటర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో డెటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీటీ రేవంత్ సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంవోయూపై తెలంగాణ  పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ సంతకాలు చేశారు.  ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ డేటా సెంటర్ హబ్‌గా మారబోతోందన్నారు. ఎస్‌టీటీ డేటా సెంటర్ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.